తెలుగుదేశం ప్రభుత్వంపై దాడిని ముమ్మరం చేసిన బీజేపీ రాజస్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. దేశంలోనే అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ రాష్ట్రంలో జరిగిందని జీవిఎల్ గవర్నర్కు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పీడీ అకౌంట్స్లో భారీగా నగదు జమ చేయడంపై కాగ్ స్పెషల్ ఆడిట్, సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు.
టీడీపీ ప్రభుత్వం చేసిన ‘‘పీడీ అకౌంట్స్ స్కాం’’ బీహార్ దాణా స్కాం కన్నా పెద్దదని ఆరోపించారు.టీడీపీ ప్రభుత్వం 53,038 కోట్ల ప్రజాధనాన్ని పీడీ అకౌంట్స్లో వేసిందని ఆయన ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం 58,539 పీడీ అకౌంట్లను తెరిచిందని అన్నారు. 2016-17 కాగ్ రిపోర్ట్ను చూస్తే ఇదో భారీ కుంభకోణంలా అనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
పీడీ అకౌంట్స్ వ్యక్తిగతమైనవని, వాటి నుంచి డబ్బు చెల్లింపులు వ్యక్తులు చేయడానికి వీలుంటుందని, ఆ డబ్బులు ఎందుకు దేనికి కోసం చెల్లించారనేది తెలియడం లేదని ఆయన అన్నారు. వాస్తవానికి పీడీ ఖాతాల్లోకి కొద్దిపాటి మొత్తాలను మాత్రమే బదలాయిస్తారని, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా నిధులు బదలాయించారని, ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో పీడీ ఖాతాల్లో డబ్బులు బదలాయించలేదని కాగ్ కూడా విస్తుపోతోందని ఆయన అన్నారు.
పీడీ ఖాతాల్లోంచి అధికారులు 2057 కోట్లు అధికారులు సెల్ఫ్ చెక్కుల ద్వారా డ్రా చేశారని తేల్చిందని, స్పెషల్ ఆడిట్ జరిగితే మొత్తం కుంభకోణం బట్టబయలవుతుందని ఆయన అన్నారు. ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం గాని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పెషల్ ఆడిట్ కు అంగీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.