తెలంగాణలో గత కొన్ని రోజులుగా సిఎం కేసిఆర్ వర్సస్ గవర్నర్ తమిళ్ సై మద్య రాజకీయ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు సిఎం కేసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ వివాదానికి తెరతీస్తూ ఉంటారు గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్. ” సిఎం కేసిఆర్ తో కలిసి పని చేయడం తనకు పెద్ద సవాల్ అని, కేసిఆర్ చెప్పిన చోట సంతకాలు పెట్టేందుకు తను రబ్బర్ స్టాంప్ కాదని ” ఆ మద్య తమిళ్ సై చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమరాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. ఇక అప్పటినుంచి కేసిఆర్ పై సందర్భాన్ని బట్టి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా మరోసారి తమిళ్ సై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
తెలంగాణ గవర్నర్ గా బాద్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్నా సందర్భంగా రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో.. ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాను చేసే పనిలో వెనుకడుగు వేయబోనని, తన పని తాను కొనసాగిస్తానని చెప్పారు. అంతే కాకుండా రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలపై సిఎం కేసిఆర్ కు లేఖ రాశానని, కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, తనకు వ్యక్తిగతంగా గౌరవం ఇవ్వకపోయినా.. రాజ్ భవన్ ను గౌరవించాలన్నారు. ప్రజల కోసం రాజ్ భవన్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని తమిళ్ సై చెప్పుకొచ్చారు. ఇక సిఎం కేసిఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ.. గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరుపుతున్నారని, ప్రోటోకాల్ ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసిందని చురకలంటించారు. ఎటోహోమ్ కు వస్తానని సిఎం రాకపోవడం ఎంతవరకు కరెక్ట్ అని ఆమె ప్రశ్నించారు.
ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలు తప్పక తెలుసుకోవాలని హెచ్చరించారు. అయితే తమిళ్ సై చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే సిఎం కేసిఆర్.. గవర్నర్ ను పట్టించుకోవడం పూర్తిగా మానేశారని రాజకీయ వర్గాల్లో చర్చ వినిపిస్తోంది. అయితే గవర్నర్ పై కూడా ఆ మద్య టిఆర్ఎస్ నేతలు గట్టిగానే విమర్శలు చేశారు. తమిళ్ సై గవర్నర్ హోదా కు తగినట్లుగా వ్యవహరించడం లేదని, బీజేపీ తొత్తుగా వ్యవహరిస్తోందని టిఆర్ఎస్ నేతలు పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో కేసిఆర్ వర్సస్ తమిళ్ సై మద్య రాజకీయ వివాదం మరింత ముదురుతోంది. అయితే గవర్నర్ హోదాలో ఉన్న ఆమెకు కనీసం ప్రోటోకాల్ విషయంలో బాధ్యత వహిండాల్సింది ప్రభుత్వమే. కానీ కేసిఆర్ సర్కార్ మాత్రం గవర్నర్ ఉన్న లేనట్లుగానే వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ వర్సస్ సిఎం కేసిఆర్ వివాదం ముందు రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.
Also Read
జగనన్నకు తలనొప్పిగా మారిన “అన్నా క్యాంటీన్లు” !