హేతుబద్దత లేని విభజనతో తీవ్రంగా నష్టపోయాం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని పదే పదే చెప్పే చంద్రబాబు… తన సొంత లాభం కోసం ఖర్చు పెట్డడం కోసం ఏ మాత్రం వెనుకాడటం లేదు. పార్టీ కార్యక్రమాలకు, వ్యక్తిగత పర్యటనలకు సైతం రాష్ట్ర ప్రభుత్వ నిధులనే విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే సొంత ఇమేజీ కోసం ఇబ్బడి ముబ్బడిగా ప్రకటనలు ఇస్తూ ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నారంటూ బాబు ప్రభుత్వాన్ని కాగ్ కడిగిపారేసింది.
కేవలం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే రెండు పత్రికలకు ఈ యాడ్స్ ఇస్తున్నట్లు కాగ్ గుర్తించింది. కేవలం చంద్రబాబు నాయుడి ఇమేజ్ పెంచేందుకు మాత్రమే ఇచ్చిన యాడ్స్, వాటికి అయిన ఖర్చు గురించి కాగ్ నివేదికలో తెలిపింది. చంద్రబాబు ప్రభుత్వ ఖర్చుతో చేసే ధర్మపోరాట దీక్షలు, నవ నిర్మాణ దీక్షలు గట్రా.. వీటి ఏర్పాట్ల కోసం భారీగా ఖర్చు పెడుతున్నారని. ఆ ఖర్చులో పెద్దఎత్తున అవినీతి కూడా జరుగుతోందని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న వారు చెబుతున్నారు.
చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు సందర్భంగా చేసిన నిరాహార దీక్ష ఖర్చు ఇరవై కోట్ల రూపాయల పైనే అని ఇదివరకే వార్తలు వచ్చాయి. ఆ రోజుకు సంబంధించి పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలకు రెండు కోట్ల రూపాయలు వెచ్చించారని కాగ్ తెలిపింది. అంతేనా చంద్రన్న ఆదరణ అంటూ చేపట్టిన మరో ప్రోగ్రామ్ కోసం బాబు ఫొటోలతో ఇచ్చిన యాడ్స్ విలువ అక్షరాలా మూడు కోట్ల రూపాయలు. ఇవన్నీ రోటిన్గా ప్రభుత్వం ఇచ్చే యాడ్స్ కాకుండా ఇచ్చిన ప్రకటనలని తెలిపింది కాగ్.
కాగ్ ఇంత వివరించి చెప్పినా చంద్రబాబు తన పని తాను చక్కగా చేసుకుంటూ పోతున్నారు. తాజాగా ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ దేశ రాజధాని ఢిల్లీలో చంద్రబాబు దీక్షకు సిద్ధమయ్యారు. ఈ దీక్షకు కూడా భారీగా ప్రజాధనాన్ని ఖర్చు చేయనున్నారు. ఢిల్లీ దీక్షకు జనాలను తరలించేందుకు రూ.10 కోట్లు ఖర్చు చేయాలని ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. ఢిల్లీ దీక్ష కోసం రూ.1.12 కోట్లతో శ్రీకాకుళం, అనంతపురం నుంచి రెండు ప్రత్యేక రైళ్లును సిద్ధం చేశారు. అంతేకాక విమానాలు, ఇతర రవాణకు రూ.2 కోట్లు, భోజనాలు వసతులు పబ్లిసిటీకి మరో రూ.8 కోట్లు కేటాయించినట్లు తెలిసింది.
ఇంతా చేసి ఆ క్రెడీట్ను మొత్తం తెలుగుదేశం పార్టీకి ఆపాదించి.. ఖర్చును మాత్రం ప్రజలపై రుద్దనున్నారు. రూపాయి ఖర్చు లేకుండా ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకే చెల్లిందని చెప్పుకోవాలి.