సార్వత్రిక ఎన్నికలు ఎంతో దూరం లేకపోవడంతో సర్వేల గోల మొదలయ్యింది. అన్ని పార్టీలు సర్వేలలో మునిగితేలుతున్నాయి. ఈ సర్వేలు కొందరి సీనియర్ నాయకులకు గుబులు పుట్టిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరయితే బాగుంటుంది?…అక్కడి జనాలు ఎవరిని కోరుకుంటున్నారు?…నియోజకవర్గంలో వారి బలాబలాలెంత?…ఫలానా అభ్యర్థికి గెలిచే అవకాశాలు ఏమేరకు ఉన్నాయి? అనే దానిమీద ముమ్మరంగా సర్వేలను నిర్వహిస్తున్నాయి పార్టీలు.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన పార్టీలను సర్వేల ఫీవర్ ఆవరించింది. ఆ ఫీడ్ బ్యాకే అభ్యర్థుల రాజకీయ భవితవ్యం తేల్చనుంది. గత సర్వేల్లో తమకు 10 పాయింట్లు…9 పాయింట్లు వచ్చాయని మురిసిపోయిన నాయకులు సైతం మళ్లీ జరుగుతున్న తాజా సర్వేలతో ఠారెత్తుతున్నారు. సిఎం చంద్రబాబు ఇంటెలిజెన్సీ సర్వేతో పాటు ఓ వర్సిటీలో చదివిన యువకులు, ఓ ప్రైవేటు సంస్థ ద్వారా వేర్వేరుగా సర్వే చేయించి నాయకుల పని తీరు, ప్రజల్లో వారికున్న బలాబలాలపై నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. మూడు నివేదికలను క్రోడీకరించి టికెట్ ఆశిస్తున్న వారి బలాబలాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార పార్టీకి చెందిన ఓ కీలక నాయకుడు తెలిపారు.
మరోవైపు వైసీపీ నాయకులనూ సర్వేల భయం వెంటాడుతోంది…నియోజకవర్గంలో పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయి?…సిట్టింగ్ ఎమ్మెల్యేల గురించి జనాలు ఏమనుకుంటున్నారు?…ఇతర పియోజకవర్గాల్లో ఎవరికి టికెట్ ఇస్తే గెలవచ్చు?…సామాజికవర్గాల బలాబలాలు…అండదండలు ఎవరికి ఉన్నాయి?…ఇలా వివిధ కోణాల్లో వైసిపికి సంబంధించి పీకే ఇప్పటికే సమగ్ర సర్వే నివేదిక ఇచ్చినట్లు ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు.
మరోవైపు ప్రత్యేక హోదా, విభజన హామీల అమల్లో కేంద్రం అన్యాయం చేసిందన్న అభిప్రాయం మెజారిటీ రాష్ట్ర ప్రజల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో బిజెపి తాజా పరిస్థితులపై సమగ్ర సర్వే చేయించినట్లు తెలిసింది.అమిత్ షా సర్వే ఆధారంగానే నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంటుందన్నారు.
ఇక జనసేన విషయానికొస్తే వచ్చే ఎన్నికల్లో ఓంటరిగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. అయితే జనసేనకు ఒకటి, రెండు జిల్లాల్లో తప్ప ఎక్కడా పార్టీ క్యాడర్ లేదు.అన్నిచోట్లా పోటీ చేయాలనుకుంటున్న జనసేన వీలైనంత బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు సర్వేనే నమ్ముకుందట.