కొద్దిరోజులుగా ఆంధ్ర ప్రదేశ్లో జరుగుతున్న ఐటీ దాడులతో టీడీపీ నేతల గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి. ఐటీ అధికారులు ఎప్పుడు ఎవరి మీద దాడులు చేస్తారోనని వణికిపోతున్నారు. తాజాగా టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంటిపై ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు.
60 మంది అధికారుల బృందం కడప, హైదరాబాద్లోని ఆయన ఇళ్లు, వ్యాపార కార్యాలయాలపై దాడులు నిర్వహించి సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం రమేశ్ ఢిల్లీలో ఉన్నారు. ఉదయమే సీఎం రమేష్ ఇంటికి వెళ్లిన ఆదాయపన్ను అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇవాళ టీడీపీ ఎంపీలు ఢిల్లీలో సమావేశం కావాల్సి ఉంది. కడప స్టీల్ ప్లాంట్ పోరాటంలో భాగంగా కేంద్ర సహాయమంత్రి బీరేంద్ర సింగ్ను నిలదీయాలని భావిస్తున్నారు.
ఇలాంటి సమయంలో సీఎం రమేష్ నివాసంపై ఐటీ దాడులు జరగడం సంచలనం సృష్టిస్తోంది. ఆదాయానికి తగ్గట్టు పన్నులు చెల్లించలేదన్న అనుమానంతో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పన్నులు ఎగవేసినట్టు అనుమానిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక సీఎం రమేశ్ పలు కాంట్రాక్టు దక్కించుకున్నారు. ఆయనకే అన్ని కాంట్రాక్టులు ఇస్తున్నారని టీడీపీ నాయకులే పలు సందర్భాల్లో బహిరంగంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐటీ దాడులు జరగడం కలకలం రేపుతోంది.
కొద్ది రోజుల క్రితం నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, కావలి టీడీపీ ఇన్ఛార్జ్ బీద మస్తాన్ రావు ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన తర్వాతి రోజే విజయవాడ, గుంటూరుల్లోని ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.