కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో జోష్ నెలకొంది. అప్పటివరకు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉన్న పోరు ఒక్కసారిగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారిపోయింది. ఇక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది కాంగ్రెస్లో చేరికల పర్వం దిశగా దృష్టిసారించారు నేతలు.
ఇక బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ ప్రకటన తర్వాత కాంగ్రెస్ నేతలను సంప్రదిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రధానంగా టికెట్ దక్కని నేతలతో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇక కాంగ్రెస్లో చేరే వారిలో బీజేపీ నేతలు కూడా ఉన్నారు. ప్రధానంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య, రేఖానాయక్ల పేరు వినిపిస్తోంది. ఇప్పటికే రేఖా నాయక్ భర్త కాంగ్రెస్లో చేరిపోయారు కూడా.
తాజాగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహాతో భేటీ అయ్యారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. వీరిద్దరి భేటీలో ప్రధానంగా స్టేషన్ ఘన్పూర్ అంశం ప్రస్తావనకు వచ్చింది. రాజయ్యకు స్టేషన్ ఘన్పూర్ సీటుపై దామోదర స్పష్టమైన హామీ ఇచ్చినట్టు సమాచారం. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీతోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు రాజయ్య. ఆ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఉద్యమ సమయంలో కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరారు. ఇప్పటివరకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే తాజాగా ఈ సీటును కడియం శ్రీహరికి ఇవ్వడాన్ని రాజయ్య జీర్ణించుకోలేకపోతున్నారు. మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి మాదిగలకు అన్యాయం జరిగిందని చెబుతుండగా మందకృష్ణ మాదిగ సైతం రాజయ్యకు మద్దతుగా నిలుస్తున్నారు.
కాంగ్రెస్లో నుండి బీజేపీలోకి వెళ్లిన నేతలు సైతం తిరిగి సొంతగూటికి చేరుకోనున్నారు. మాజీ ఎంపీ వివేక్, రాజగోపాల్ రెడ్డితో సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరుగగా వీరికి ఇవ్వాల్సిన సీట్లపై క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ఇక అలాగే అన్ని అనుకూలిస్తే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సైతం హస్తం పార్టీలో చేరుతారని ఆ పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు చేరికను బలంగా మార్చుకుని ఎన్నికల సమరంలో దిగాలని భావిస్తున్న కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి..