ఆంధ్రప్రదేశ్లో మరో ఆరేడు నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను ఓ సినిమా ప్రభావితం చేయబోతోంది. వైఎస్ రాజశేఖర్రెడ్డిపై యాత్ర పేరుతో దర్శకుడు మహి.వి.రాఘవ తెరకెక్కిస్తున్న యాత్ర సినిమా వచ్చే ఎన్నికలను ప్రభావితం చేసేలా కనిపిస్తోంది. వై.ఎస్.ఆర్ జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసి.. రాజన్నను వారి మదిలో మళ్లీ కొలువుదీరేలా చేయడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశం. అందుకే.. సినిమా బడ్జెట్ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా.. దేశంలోనే ప్రముఖ నటులనందరినీ ఏరికోరి తెచ్చి.. యాత్ర సినిమాలో నటింపజేస్తున్నారు. వై.ఎస్.జగన్తో పాటూ కుటుంబ సభ్యులందరూ ఈ సినిమా విషయంలో ప్రత్యేక చొరవ చూపుతున్నట్టు సమాచారం. వైఎస్తో సంబంధం ఉన్న ప్రతిఒక్కరినీ కలిసి మాట్లాడి.. బయట ప్రపంచానికి తెలియని అనేక విషయాలను ఈ చిత్రం ద్వారా తెలియజెప్పేందుకు దర్శకుడు మహి.వి.రాఘవ ప్రయత్నం చేస్తున్నాడు. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్ల, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నప్పటికీ.. ఇప్పటికే ఇది వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల అస్ర్తంగా కూడా మారబోతున్నట్టు స్పష్టమైంది. ఈ సినిమాను సరిగ్గా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అంటే.. ఎన్నికలకు సరిగ్గా నెల నుంచి రెండు నెలల్లోపు ఈ చిత్రం థియేటర్లలోనికి రాబోతోందన్నమాట.
వైఎస్ రాజశేఖర్రెడ్డిని అభిమానించేవాళ్ల సంఖ్య లెక్కలేనిది. వైఎస్ స్వభావం, పేదల కోసం ఆలోచించకుండా పథకాలను ప్రవేశపెట్టే నైజం లాంటివి వైఎస్ను సామాన్యులకు చేరువ చేశాయి. కానీ.. అనుకోకుండా ఎవరూ ఊహించని విధంగా అర్థాంతరంగా వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ షాక్లో అప్పట్లో 600 మందికి పైగా వైఎస్ అభిమానులు గుండె ఆగిపోయి చనిపోయారు. వైఎస్ పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దవ్వడం, వైద్య విద్య అభ్యసించడం, విజయమ్మతో పెళ్లి, రాజకీయ ఆరంగేట్రం, పిల్లలు, మనవలు, ముఖ్యమంత్రి పీఠం వరకూ.. ప్రతి కోణాన్ని మరోసారి జనం ముందు ఆవిష్కరించే పనిలో మహి.వి.రాఘవ ఉన్నారు. అయితే.. చిత్రాన్ని ఏదో సాదాసీదాగా కాకుండా.. భారీ బడ్జెట్, పెద్ద నటులతో తీస్తేనే.. దాని ప్రయోజనాలు ఆశించన మేరకు అందుతాయని దర్శక, నిర్మాతలు.. వైఎస్ కుటుంబ, వారి శ్రేయాభిలాషులు అభిప్రాయపడ్డారు. అందుకే.. బడ్జెట్కు ఏమాత్రం వెనుకాడకుండా.. వైఎస్ పాత్రలో దక్షిణ భారతదేశంలోనే ఉత్తమ నటుడైన మమ్ముట్టిని ఎంపిక చేశారు. వైఎస్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పాత్రలో సుహాసిని, వైఎస్ కుమార్తె షర్మిళ పాత్రలో భూమిక నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో వైఎస్ పాత్ర ఎంత ప్రధానమో.. ఆయన కుమారుడు జగన్ పాత్ర కూడా అంతకు పదిరెట్లు ప్రభావవంతంగా ఉండేలా తీర్చిదిద్దనున్నారు. అందుకే.. తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతున్న యాత్ర సినిమాలో జగన్ పాత్రకు ఎంతో పేరున్న నటుడైతే బాగుంటుందని అనుకున్నారు. ప్రస్తుతం ఈ పాత్రకు తమిళ నటుడు కార్తీని ఎంపిక చేసినట్టు సమాచారం. కార్తీ డేట్స్ సర్దుబాటు కోసం కాస్త సమయం అడిగారని, ఆయన అంగీకరిస్తే.. షూటింగ్ను ప్రారంభించనున్నటు్ట తెలిసింది. కార్తీ నటిస్తే.. జగన్ పాత్ర మరింత ప్రభావవంతంగా ఉండేందుకు అవకాశం ఉంది. అందుకే ఎలాగైనా అతడిని నటింప చేయాలనే కృతనిశ్చయంతో సినిమా టీం ఉంది. రాష్ర్టంలో జరగబోయే వచ్చే ఎన్నికలు జగన్కు చాలా ముఖ్యమైనవి. ఎలాగైనా ఈసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో జగన్ ఉన్నారు. దానికి.. వైఎస్ గురించిన జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసి.. వాటిని ఓటు బ్యాంకుగా మార్చుకునే వ్యూహం చేస్తున్నట్టు తెలిసింది తాజాగా వైఎస్ జయంతి రోజు విడుదల చేసిన యాత్ర టీజర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.