పవన్ కళ్యాణ్కు ఆంధ్రలో ఉన్నంత పట్టు తెలంగాణలో లేదు. ఆయన సినిమాలు చూసి.. అభిమానులున్నారు తప్ప.. ఆయన పార్టీని ఆహ్మానించి.. కార్యకర్తలుగా చేరేవాళ్లు తక్కువే. అయితే.. జనసేన పార్టీని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బలోపేతం చేసి.. వచ్చే ఎన్నికల బరిలో అక్కడా.. ఇక్కడా దిగేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. ఆంధ్రలో ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న బస్ యాత్రకు సైతం బ్రేక్ ఇచ్చారు. కంటి శస్త్రచికిత్స ఒక కారణం కాగా.. తెలంగాణలో ముందస్తు ఎన్నికల వార్తలు వస్తుండడంతో దానిపై చర్చించేందుకు హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో పవన్ తన పార్టీ శ్రేణులతో చర్చలు జరుపుతుండడం మరో కారణం. ప్రస్తుతం తెలంగాణలో జనసేన పార్టీకి ఇన్ఛార్జిగా నియమితుడైన శంకర్గౌడ్, పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్రెడ్డిలు శ్రేణులను సమకూర్చుకునే పనిని చేపడుతున్నారు. దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్ సూచన మేరకు తెలంగాణలో కనీసం 15లక్షల మందిని పార్టీ సభ్యత్వం ఇచ్చి సభ్యులుగా తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి ఓ 300 మందిని హైదరాబాద్ మాదాపూర్లోని జనసేన కార్యాలయానికి తీసుకొచ్చి మరీ పార్టీ కండువాలు కప్పి చేర్చుకున్నారు. తెలంగాణలో ఎన్నికలకు కీలకమైన స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ, హైదరాబాద్ కమిటీలను ఏర్పాటు చేసేందుకు సమర్థులైన నాయకుల కోసం వెతుకుతున్నారు. కానీ.. తెలంగాణలో జనసేన పార్టీలో చేరేందుకు పెద్దనాయకులెవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఇటీవల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలోనూ.. ఈ విషయంపై చర్చ జరిగింది. పెద్ద నాయకులు రాకపోవడం మంచిదేనని.. కిందిస్థాయి, కార్యకర్తలకే నాయకులుగా ఎదిగే అవకాశం ఉంటుందంటూ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలు ముందస్తుగా వస్తే.. డిసెంబర్ నాటికే సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. యథావిధిగా జరిగితే.. మార్చి వరకూ అవకాశం ఉంటుంది. అంటే.. ఆంధ్ర, తెలంగాణల్లో ఎలా చూసినా.. ఎన్నికల సన్నద్ధానికి అన్ని పార్టీలకూ ఉన్నది ఐదారు నెలలకు మించి లేదు. ఈ సమయాన్ని ఎంత త్వరగా సద్వినియోగం చేసుకుంటే.. పార్టీకి ఎన్నికల్లో అంత కలిసొస్తుంది. ఉన్న ఈ కొద్దిపాటి సమయంలో పవన్ కళ్యాణ్కు మంచి పట్టున్న ఆంధ్రప్రదేశ్లోనే పూర్తిస్థాయిలో శ్రేణులను సమకూర్చుకోవడం కత్తిమీద సాములాంటిది. అలాంటిది.. ఆంధ్రను పక్కన పెట్టి ఇప్పుడు తెలంగాణపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టడం.. వృథా ప్రయాసే అవుతుంది. తెలంగాణలో ఎన్ని పార్టీలు పోటీచేసినా.. అంతిమంగా కేసీఆర్కే మళ్లీ అధికారం దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ విషయం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి సైతం బాగానే తెలుసు. అందుకే.. తెలంగాణలో పార్టీ బాధ్యతలను పూర్తిగా రమణ లాంటి నాయకులకు అప్పగించేసి.. తాను పూర్తిగా ఆంధ్రపైనే ఫోకస్ పెట్టారు. తెలంగాణ సెంటిమెంట్తో కేసీఆర్ మరోసారి ఎన్నికల్లో గెలవడం ఖాయం. ఈ నేపథ్యంలో గట్టిగా ప్రయత్నించి సర్వశక్తులను ఒడ్డినా.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఒకటి రెండు సీట్లకు మించి గెలుచుకునే అవకాశం లేదు. అదికూడా పూర్తిస్థాయిలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసి, సభలు, సదస్సులు పెడితేనే.. ఆ ఒకటి రెండైనా వస్తాయి. దీనివల్ల పవన్పార్టీకి పెద్దగా వచ్చే ప్రయోజనం కూడా లేదు. ఎలాగూ.. కేసీఆర్ ఎన్నికల ముందు తన బ్రహ్మాస్త్రం బయటకు తీసి.. జనసేనను ఆంధ్ర పార్టీగా ప్రచారం చేసి.. తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టినట్టే కొడతారనేది బహరింగ రహస్యమే. దీనివల్ల పవన్ పార్టీ మాటేమోగానీ.. ఉన్న కాస్త పాపులారిటీని సైతం పోగొట్టుకుని.. అవమానభారంతో వెళ్లాల్సి వస్తుందనేది రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్న మాట. కానీ.. పవన్ చుట్టూ ఏర్పడిన కోటరీ తెలంగాణలోనూ మనం బలంగా ఉన్నామని, అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీకి దిగుదామంటూ నూరిపోస్తుండడం వల్లే.. ఫోకస్ను టీఎస్పైకి మళ్లించినట్టు సమాచారం. అయితే.. ఇప్పటినుంచి ప్రయత్నించినా.. ఎన్నికల నాటికి జనసేన తరఫున పోటీకి బరిలో దిగే అభ్యర్థులను సమకూర్చుకోవడమే చాలా కష్టం. ఇంక కార్యకర్తలు, పార్టీ శ్రేణులను తేవడం కుదిరే పనే కాదు.