తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు ఎన్నికల నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్కు ముందు తన ఇష్ట దైవం కోనాయిపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. నామినేషన్ పత్రాలను దైవ సన్నిధిలో ఉంచి పూజలు నిర్వహించిన అనంతరం.. అక్కడే పత్రాలపై సంతకం చేయనున్నారు. అనంతరం గజ్వేల్ బయలుదేరి వెళ్లి మధ్యాహ్నాం 2.34గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఈ ఎన్నికల్లో వంద సీట్లు సాధించి మరో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కోనాయిపల్లి వెంకటేశ్వర్వస్వామి ఆశీస్సులు పొంది తాను ఏ యుద్ధంలో పాల్గొన్న ఏనాడూ ఓటమి పాలు కాలేదన్నారు. ఆనాడు డిప్యూటీ స్పీకర్గా తాను మీ వద్ద ఆశీస్సులను పొందిన విషయాన్ని గుర్తు చేశారు. ఆనాడు మీ అనుమతి పొందిన తర్వాతే రాజీనామా చేసినట్టు ప్రస్తావించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనతి కాలంలోనే సమస్యలను అతి తక్కువ కాలంలోనే పూర్తి చేసినట్టు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వెంకన్న కాళ్లను అభిషేకం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అభివృద్ధిలో తెలంగాణను అగ్రభాగాన నిలిపినట్టు ఆయన చెప్పారు
రాష్ట్రాన్ని చక్కదిద్దే క్రమంలో ప్రజలకు దూరమయ్యానన్న బాధ తనలో ఉందని అన్నారు. దేశంలోనే ధనిక రైతులకు తెలంగాణ వేదికగా మారాలని ఆకాంక్షించారు. సిద్ధిపేటలో హరీష్ రావును ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. అనంతరం నామినేషన్ వేయడానికి ఆయన కోనాయిపల్లి నుంచి బయల్దేరారు.