2014 ఎన్నికల్లో టీడీపీకి మనీగనిలా పనిచేసిన మంత్రి నారాయణకు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది. 2014లో నారాయణ ఆర్థిక సేవకు మెచ్చిన చంద్రబాబు.. నేరుగా మంత్రిని చేసేశారు. అయితే దొడ్డిదారి మంత్రి అన్న మాట నారాయణను బాగా నొచ్చుకునేలా చేస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రజల నుంచి గెలవాలని నిర్ణయించుకున్నారు.
అందుకోసం తొలుత నెల్లూరు సిటీపై కన్నేశారు. కొద్ది నెలల క్రితం వరకు నెల్లూరు సిటీ పరిధిలో బాగా పర్యటనలు చేశారు. అంతా చేసి జనం తన గురించి ఏమనుకుంటున్నారో సర్వే చేయించుకోగా.. అబ్బే జనం నుంచి నారాయణ పట్ల స్పందనలు లేవు. పైగా సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పట్లే జనం సానుకూలంగా ఉండడం నారాయణ సర్వేలో తేలిందని చెబుతున్నారు. ఎమ్మెల్యే అనిల్పై పోటీ చేస్తే గెలుపు కష్టమని సర్వే తేల్చడంతో ఆయన .. నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని వదిలేశారు.
ఇప్పుడు నెల్లూరు రూరల్పై ఫోకస్ పెట్టారు. రూరల్ టీడీపీ ఇన్చార్జ్గా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నప్పటికీ నారాయణ లెక్క చేయడం లేదు. రూరల్లో పాగా కోసం పర్యటనలు మొదలుపెట్టారు. దీనిపై ఇటీవల ఆదాల స్వయంగా నారాయణను నిలదీశారు. నాలుగేళ్లు తాను పనిచేస్తుంటే ఇప్పుడు మీరు వచ్చి వేలు పెట్టడం మర్యాదగా లేదని వ్యాఖ్యానించారని చెబుతున్నారు. అయితే చంద్రబాబు తన మనిషే కావడంతో నారాయణ మాత్రం తగ్గడం లేదు.
మరి కొన్ని నెలలు ఆగి.. రూరల్లో తన గురించి జనం ఏమనుకుంటున్నారో నారాయణ ఎలాగో సర్వే చేయించుకుంటారని.. అప్పుడు మంత్రికే అసలు విషయం అర్థమవుతుందని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రూరల్లోనూ వైసీపీని ఓడించడం ఈజీ కాదని.. పైగా ఆదాల లాంటి వారు నారాయణ బరిలో దిగితే సహకరించే అవకాశమే లేదంటున్నారు. కాబట్టి నారాయణ నెల్లూరు రూరల్పై సర్వే చేయించుకున్న తర్వాత మరోసారి ఏ నియోజకవర్గానికి వలస వెళ్తారో చూడాలి అంటున్నారు.