మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంలోపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు పార్టీ మారిన దాడి గత కొద్దికాలంగా సైలెంట్ గా ఉన్నారు. కానీ ప్రస్తుత రాజకీయాల దృష్ట్యా ఆయన మళ్లీ యాక్టీవ్ అయినట్లు తెలుస్తోంది.
విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పవన్ దాడిని జనసేనలోకి ఆహ్వానించారు. అందుకు దాడి తన అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. అయితే ఇప్పుడు దాడి జనసేనలో చేరిపోయారు. కానీ దాడి జనసేనలో చేరికపై పలువురు నేతలు, నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుపార్టీలు మారిన దాడి వీరభద్రరావు జనసేనలోనైనా ఉంటారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు.
ఉత్తర కోస్తాలో మాజీ మంత్రి దాడివీరభద్రరావు బలమైన నాయకుడనే పేరుంది. ఆ పేరుతోనే కాంగ్రెస్ నుంచి టీడీపీ తీర్దం పుచ్చుకున్నారు. టీడీపీ లో అధినేత చంద్రబాబు దాడికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడంతో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.
ఆ తరువాత గత ఎన్నికల కంటే ముందుగా వైసీపీ లో చేరారు. అక్కడ ఇమడలేక 2015లో వైసీపీ నుంచి భయటకు వచ్చారు. అదే సమయంలో దాడి వీరభద్రరావు తిరిగి తాను టీడీపీ లోకి రావాలని ఉన్నట్లు చంద్రబాబు కు విన్నవించుకున్నారు. కానీ అనకాపల్లి నియోజకవర్గంలో తమపై దాడి పెత్తనం చెలాయిస్తారనే తెలుగు తమ్ముళ్లు భయపడ్డారు. దీంతో చంద్రబాబు దాడి నిర్ణయం పై స్పందించలేదు. దీంతో తాను చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో సైలెంట్ అయ్యారు.
దీంతో గతకొద్దికాలంగా దాడి వీరభద్రరావు, అతని కుమారుడు రత్నాకరరావు సైలెంట్ అయ్యారు. ఈ నేపథ్యంలో జనసేనలో చేరి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే సంకేతాలను దాడి కుమారుడు రత్నాకర రావు విశాఖ పర్యటనలో ఉన్న పవన్ కు సందేశాలు పంపించారు.
దీంతో విశాఖ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లి జనసేనలోకి రావాలని ఆహ్వానించారు. పవన్ ఆహ్వానం మేరకు తన అనుచరులతో మాట్లాడి భవిష్యత్తు రాజకీయ ప్రకటన చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా దాడి కుమారుడు మాట్లాడుతు తనతండ్రి దాడి వీరభద్రరావు జనసేనలోకి రావాలని పవన్ ఆహ్వనించినట్లు, పార్టీలో చేరి టీడీపీ ఓటమికి కృషి చేయాలని అన్నట్లు చెప్పారు.
అయితే ఈ విషయం జనసేన నేతలకు, పవన్ అభిమానులకు మింగుడు పడడం లేదు. ఇప్పటికైనా జనసేనలోనే ఉంటారా..? లేదంటే అవకాశాలకోసం మరో పార్టీ చెంతన చేరుతారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.