రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై దూకుడు పెంచారు సీఎం కేసీఆర్.ప్రగతి నివేదన సభతో ఎన్నికలకు శంకుస్థాపన చేసిన కేసీఆర్ రాష్ట్రంలో పర్యటనకు సిద్ధమవుతున్నారు. ప్రతగి నివేదన సభలోనే అసెంబ్లీ రద్దు ప్రకటన చేస్తారని భావించిన అందరికీ అనూహ్యంగా షాక్ ఇచ్చారు. సభలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రజలకు ఏంచేసింది వివరించారు.
అయితే తాజాగా అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. గురువారం (సెప్టెంబర్ 6) ఉదయం జరగనున్న కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్.. అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. వాస్తు, జ్యోతిష అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే కేసీఆర్.. పండితుల సూచన మేరకే ముందడుగు వేయనున్నట్లు తెలుస్తోంది.ఆ రోజు ఉదయం కేబినెట్ భేటీ అనంతరం నేరుగా గవర్నర్ను కలిసి అసెంబ్లీ రద్దు చేస్తున్నట్లు లేఖ ఇచ్చే అవకాశం ఉంది.
ప్రగతి నివేదన సభతో జోష్ పెరగడంతో ప్రతిపక్షాలకు అంతు చిక్కని వ్యూహాలతో ముందుకెళ్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 100 బహిరంగ సభలు నిర్వహించాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. ఈ బహిరంగ సభలకు ‘ప్రజల ఆశీర్వాద సభ’గా నామకరణం చేయడం గమనార్హం. వచ్చే శుక్రవారం (సెప్టెంబర్ 7)న హుస్నాబాద్లో తొలి బహిరంగ సభను నిర్వహించ తలపెట్టారు.
హుస్నాబాద్ సభ కోసం జనసమీకరణకు 5, 6 తేదీల్లో సమావేశాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ సూచించారు. ఎన్నికల ప్రచారం కోసం ఇప్పటికే భారీ ఎత్తున ప్రచార రథాలు, సామగ్రి కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.
రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ కోసం ప్రవేశపెట్టిన ఆధునిక సాఫ్ట్వేర్ ఈఆర్వో నెట్ 2 వెర్షన్పై అన్ని జిల్లాల ఎన్నికల విభాగం డిప్యూటీ తహశీల్దార్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు జీహెచ్ఎంసీలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్ కీలక సూచనలు చేశారు. ముందస్తు ఎన్నికలు వస్తే ఎలా వ్యవహరించాలో కేంద్ర ఎన్నికల సంఘం సూచిస్తుందని రజత్ కుమార్ తెలిపారు.
ఎన్నికల ప్రచారానికి వెల్లే ముందు మరో కొత్త పథకాన్ని ప్రకటించనున్నారు కేసీఆర్. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం’ పేరుతో పిలుస్తున్న ఈ పథకాన్ని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ప్రారంభించనున్నారు. దీని ద్వారా మత్స్యకారులకు 885 బైక్లు, 12 మందికి లగేజీ ఆటోలు, ఇతర ఉపకరణాలు పంపిణీ చేయన్నారు.