తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు చురుగ్గా ప్రయత్నాలు జరుతున్నాయా..? ఆ దిశగా అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారా..? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. గవర్నర్తో సీఎష్, అసెంబ్లీ కార్యదర్శి భేటీ కావడం ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు బలం చేకూరింది.
ముందస్తు ఎన్నికలకు వెల్లాలని సీఎం కేసీఆర్ ఉత్సాహం చూపిస్తున్నారు. అసెంబ్లీ రద్దు, ఎన్నికల అంశంపై ప్రగతి నివేదన సభలో క్లారిటీ ఇస్తారని అందరూ భావించినా అదేం జరగలేదు. ప్రగతినివేదన సభ ముందు కేబినేట్ సమావేశ మయ్యింది. అయితే మరో సారి భేటీ కావాలని కేసీఆర్ నిర్ణయించారు.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అసెంబ్లీ రద్దు, ముందస్తుఎన్నికల దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి సచివాయలంలో పలు అధికారులు భేటీ అయ్యారు. తెలంగాణ సచివాలయంలో సీఎస్ ఎస్ కే జోషీతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ భేటీ అయ్యారు. ముందస్తు ఎన్నికల ప్రచారం సాగుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
గవర్నర్ నరసింహన్ తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి నర్సింగరావులు భేటీ అయ్యారు. దీనికి ముందు సెక్రటేరియట్ లో అధికారులు కీలక సమావేశాన్ని నిర్వహించారు. అసెంబ్లీ రద్దు వార్తల నేపథ్యంలో, మరో రెండు రోజుల్లో కేబినెట్ సమావేశం జరగనున్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దానిలో భాగంగానే తన ఫాం హౌస్ నుంచి వ్యూహ రచనలో బిజీగా ఉన్నారు. ఆయన సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఫామ్ హౌస్ చేరుకున్నారు. కేబినెట్ సమావేశం, అసెంబ్లీ రద్దులపై పార్టీ సీనియర్ నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
మరో వైపు ఫాం హౌజ్ కు రావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషీ, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహదారు రాజీవ్ శర్మను, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావును, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులను ఫాం హౌజ్ కు రావాలని కేసీఆర్ ఆదేశించినట్టు సమాచారం.
ఈ నెల 6న కేబినెట్ భేటీ అవకాశముంది. 7వ తేదీన హుస్నాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనిపై మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావులకు ఆదేశాలు వెళ్లాయని తెలుస్తోంది. చివరి కేబినేట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీరద్దు, ఎన్నికలు, విధానపరమైన నిర్ణయాలు ఒకే సారి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సీఎస్ సహా అధికారులకు పిలుపు అసెంబ్లీ రద్దు వెంటనే కేసీఆర్ ప్రచార బరిలోకి దిగుతారని అంటున్నారు. 50 నియోజకవర్గాల్లో 100 బహిరంగ సభలు నిర్వహించే అవకాశముంది. ఇందులో భాగంగా హుస్నాబాద్లో 7న సభ నిర్వహించనున్నారు. అసెంబ్లీ రద్దుపై మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు రెడీ అయినట్లు తెలుస్తోంది.