ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కోదండ రాం పాత్ర మరువలేనిది. నిర్జీవంగా ఉన్న ఉద్యమానికి జవసత్వాలు అందించి నిరంతరం తెలంగాణ నినాదాన్ని ప్రపంచంలో ఉండేలా చేసి చివరకు శాంతియుత వాతావరణంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో కోదండరాం పాత్ర మరువలేనిది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన్ను కొందరు మరుగున పడేసేలా చేశారు. మారిన రాజకీయ పరిణామాలు.. రాజకీయ ఆటలో కోదండరాం కొంచెం వెనకబడ్డారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంపై పోరాడేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఇన్నాళ్లు ప్రభుత్వంపై పోరాటం చేసిన ఆచార్యుడు ఇప్పుడు తనకు తాను కొత్త రాజకీయ వేదికను ఏర్పాటుచేసుకొని ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరించాలని కోరుతున్నాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో 2011 మార్చి 10వ తేదీ మిలియన్ మార్చ్ నిర్వహించారు. ఈ ఒక్క కార్యక్రమంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఈ కార్యక్రమంలో ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలవడంతో ఆ రోజే పార్టీ ఏర్పాటును ప్రకటిస్తారని సమాచారం.
ఈ మేరకు మార్చి 10న భారీ బహిరంగ సభను ఏర్పాట్లలో కోదండ రాం బిజీగా ఉన్నారు. ఆ రోజు తన రాజకీయ పార్టీ, కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. మిలియన్ మార్చ్తో సమైక్య రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేసిన మాదిరిగా తెలంగాణ ప్రజల కోసం పునరంకితం అయ్యేందుకు మార్చి 10వ తేదీన కోదండ రాం ప్రణాళిక వేసుకున్నారు. తన పార్టీకి సంబంధించిన కీలకాంశాల్ని ప్రకటించేటట్టు కనిపిస్తోంది.
ఫిబ్రవరి రెండో వారంలో కోదండ రాం రాజకీయ పార్టీని ప్రకటించాలని అనుకున్నా.. భావోద్వేగాన్ని రగిలించేలా పార్టీ ప్రకటన ఉండాలనే ఉద్దేశంతో మార్చి 10వ తేదీని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు పార్టీ పేరు తెలంగాణ జన సమితి ఉండనుందని సమాచారం. ఈ పేరుకు సంబంధించి సాంకేతిక అంశాలు.. ఇతర సమస్యలు ఒకవేళ వస్తే మరో మూడు పేర్లను కూడా సిద్ధం చేసుకున్నారు. అవే తెలంగాణ సకల జనుల పార్టీ.. తెలంగాణ ప్రజా పార్టీ.. ప్రజా తెలంగాణ పార్టీ తదితర పేర్లను ముందస్తుగా పెట్టుకున్నారు. అయితే పార్టీ విధి విధానాలపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. పార్టీ ఆవిర్భావ సమావేశంలో పార్టీ ఏర్పాటు వెనుక ఉద్దేశం.. లక్ష్యాల్ని కోదండ రాం వివరించే అవకాశం ఉంది.
హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాల్నా.. లేదా జిల్లాలో నిర్వహించాల్నా అనే విషయాలో ఇంకా తేలలేదు. చివరకు హైదరాబాద్ బెటర్ అని నిర్ణయానికి వచ్చారంట. మొత్తానికి మార్చి 10వ తేదీన కోదండ రాం సార్ పార్టీ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించి 2019 ఎన్నికల్లో ప్రభుత్వానికి చుక్కలు చూపించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.