టీఆర్ఎస్ నేత, ఆందోల్ మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్ పార్టీ మారారు. గులాబీ పార్టీని వీడి కమలం గూటికి చేరారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్తో పాటు ఆయన ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.బాబూ మోహన్కు పార్టీ కండువా కప్పిన అమిత్ షా ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు.
అందోల్ నియోజకవర్గం టికెట్ను బాబుమోహన్కు బీజేపీ కేటాయించినట్టు తెలుస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అందోల్ నుంచి గెలుపొందిన బాబుమోహన్కు తాజా ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ టికెట్ నిరాకరించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీని రద్దు చేసిన అనంతరం 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించిన కేసీఆర్.. బాబుమోహన్ను కాదని అందోల్ టికెట్ను జర్నలిస్టు క్రాంతి కుమార్కు ఇచ్చారు. దీంతో మనస్థాపం చెందిన బాబూ మోహన్ భాజాపా కండువా కప్పుకున్నారు.
ఈ క్రమంలో కష్టపడి పనిచేసినా టీఆర్ఎస్ పెద్దలు తనపై వివక్ష చూపుతున్నారని బాబుమోహన్ తన సన్నిహితుల వద్ద విచారం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ టికెట్ నిరాకరిచండంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆయనను బీజేపీ నేతలు బుజ్జగించి తమవైపునకు తిప్పుకున్నట్టు తెలుస్తోంది. అందోల్ టికెట్ ఇస్తామని తనకు హామీ లభించడంతోనే ఆయన ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం. ప్రస్తుతం అందోల్ నియోజకవర్గంలో బీజేపీకి తగినంత బలం లేకపోవడంతో బాబుమోహన్ చేరిక తమకు లాభిస్తుందని కమలనాథులు భావిస్తున్నారు.