కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న డీ. శ్రీనివాస్ కొంత కాలం క్రితం టీఆర్ఎస్ లో చేరారు. డీ.శ్రీనివాస్కు రాజ్యసభ పదవిని కట్టబెట్టారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వ సలహదారుగా కూడ ప్రభుత్వం బాధ్యతలను కట్టబెట్టింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తనకు వ్యతిరేకంగా ప్రజా ప్రతినిధులు తీర్మానం చేసి, కేసీఆర్ కు పంపారు పార్టీ నాయకులు. అప్పటి నుంచి అధిష్టానంపై డీఎస్ గుర్రుగా ఉన్నారు.
తనంతట తానుగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేసి వెళ్లే ప్రసక్తే లేదని, కావాలంటే తనను సస్పెండ్ చేసుకోవచ్చని ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు డి.శ్రీనివాస్ పరోక్షంగా సంకేతాలిచ్చారు. తానే రాజీనామా చేసి వెళితే, తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించినట్లవుతుందని అభిప్రాయపడ్డ ఆయన, కావాలంటే పార్టీ అధిష్ఠానమే తనపై చర్యలు తీసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
నన్ను సస్పెండ్ చేయడం చేతకాకపోతే తీర్మానాన్ని వెనక్కు తీసుకోవాలని సూచించారు. తనను రాజకీయంగా దెబ్బ తీశారని, నా కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చారు..అందుకే లేనిపోనివన్నీ కల్పించి జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి నా కుమారుడు సంజయ్పై కేసు పెట్టించారని ఆరోపించారు.
స్వతంత్రంగా పెరిగిన తన కుమారులు సొంత నిర్ణయాలు తీసుకుంటారని, వారి నిర్ణయాలను తాను అడ్డుకోలేనని కూడా డీఎస్ వ్యాఖ్యానించారు. నా రెండో కుమారుడు అరవింద్ బీజేపీలో చేరడం అతని స్వీయ నిర్ణయం. నా ప్రమేయం లేదు అయినా నేను ఏమీ చేయలేని పరిస్థితి. నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో క్రమశిక్షణతో మెలిగాను. పార్టీని మోసం చేయడం నాకు తెలియదు. తెలంగాణ పట్ల నాకు ఉన్న ప్రేమ నిబద్దతను ఎవరూ ప్రశ్నించలేరన్నారు.
నపై ఆరోపణలు చేసిన వారికి ధైర్యముంటే తాను ఏం వ్యతిరేక పనులు చేశానో చెప్పాలని సవాల్ విసిరిన ఆయన, మనసులో ఏదో పెట్టుకుని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని జిల్లా నేతలను విమర్శించారు. రాజకీయంగా తనను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని డీఎస్ ఆరోపించారు. డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యవర్గం ఇటీవల ఓ తీర్మానం చేసి, పార్టీ అధిష్ఠానానికి పంపిన సంగతి తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.