ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచీ ఓ నియమాన్ని కచ్చితంగా పాటిస్తున్నారు. ఏ నియోజకవర్గం మీదుగా పాదయాత్ర జరుగుతున్నా, ఆయా నియోజకవర్గంలోని ప్రధాన పట్టణంలోనే, ప్రధాన రహదారిలోనో కచ్చితంగా బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఓ బస్సుపైకి ఎక్కి ఆ సభలో ప్రభుత్వ వైఫల్యాలు, టీడీపీ నాయకులు ఇచ్చిన హామీలు, వాటి అమలు కోసం ఎదురు చూస్తున్న ప్రజల ఆవేదన గురించి మాట్లాడుతున్నారు. తమ ప్రభుత్వం వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలను గురించి పూసగుచ్చినట్లు విడమరిచి మరీ చెబుతున్నారు. నాటి వైఎస్ పాలనలో అమలయిన సంక్షేమ పథకాలు, నేటి బాబు పాలనలో అమలవుతున్న అవినీతి పథకాల గురించి ఆధారాలతో సహా వివరించి పాలకుల తీరును ఎండగడుతున్నారు.
అయితే వీటితో పాటు జగన్ చేస్తున్న ఓ మంచి పని ఏంటంటే…ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ తరఫున ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న అభ్యర్ధులతో మాట్లాడించడం. సమావేశాన్ని వారి స్పీచుతోనే ప్రారంభిచండం. వారి ద్వారా తన స్వాగతోపన్యాసం ఇప్పించడం. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులతోనే వారి నియోజకవర్గంలోని సమస్యలను గురించి వివరించడం. ఆయా సమస్యల పరిష్కారానికి చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరిచిపోయిన వైనం గురించి మాట్లాడిస్తున్నారు. దీంతో తమ స్థానిక నేతలకు తమ నియోజకవర్గ సమస్యలపై పూర్తి అవగాహన, బాధ్యత ఉందనే భావన స్థానికుల్లో కలుగుతోంది. ఇక వారి స్పీచు అయిపోయిన తర్వాత జగన్ మాట్లాడుతున్నారు. ఆయన స్పీచ్ ముగించే ముందు మరోసారి తమ పార్టీ నుంచి పోటీ చేయబోయే ఎంపీ, ఎమ్మెల్యే కేండిడేట్స్ గురించి మళ్లీ తనే స్వయంగా వివరిస్తూ, మీ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తారు. ఈసారి ఎన్నికల్లో ఓటేసి ఆశీర్వదించండి అమ్మా…అంటూ అభ్యర్ధిస్తున్నారు. దీంతో టికెట్లు ఆశిస్తున్న ఆశావహులకీ పని చేయాలనే ఉత్సాహం రెట్టింపు అవుతోంది. దీంతో ఖర్చులకు, కష్టాలకు వెనుకాడక వారు శక్తివంచన లేకుండా తమ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు.
ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీరు ఇందుకు పూర్తి విరుద్ధం. నేను అనంతపురంలో పోటీ చేస్తాను అని మొన్న చెప్పారు. నేను శ్రీకాకుళంలో కూడా పోటీ చేస్తాను అని నిన్న చెప్పారు. కానీ తన పార్టీ తరఫున ఎవరు పోటీ చేయబోతున్నారో ఏ ఒక్క బహిరంగ సభలోనూ చెప్పడం లేదు. తన మీటింగుల కోసం బీజేపీ ఫండ్స్ ఏర్పాటు చేస్తోందన్న వాదనలను ప్రస్తుతానికి వదిలేద్దాం. కానీ పవన్ ఏ ఊరు వెళితే ఆ ఊరిలో స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు, జనసేన నుంచి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న అభ్యర్ధులు తమ శక్తిమేరా ఖర్చు చేస్తున్నారు. సభ సక్సెస్ కావాలని కష్టపడుతున్నారు. కానీ పవన్ ఉపన్యాసాలు ఇచ్చే వేదికలపైకి మాత్రం తమకు అనుమతి ఉండటంలేదు. వన్ మ్యాన్ ఆర్మీలాగా పవనే మాట్లాడేసి వెళ్లిపోతే ..ఇక మాకు గుర్తింపు ఎలా వస్తుంది ? అని టికెట్లు ఆశిస్తున్న అభ్యర్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు జనానికి తమను పవన్ పరిచయం ఎందుకు చేయట్లేదని నిలదీస్తున్నారు. ఆయన సభల కోసం ఖర్చులు మావి, ప్రచారం పవన్ దా ? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో జగన్ ను చూసి పవన్ నేర్చుకోవాల్సింది చాలా ఉందని జనసేన నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోతున్నారు.