చంద్రబాబు అంటే ఒక్కడు కాదు.. తన సామాజిక వర్గ నేతలు, వారి అడుగులకు మడుగులోత్తే మీడియా, కీలకశాఖల్లో ఉన్నతాధికారులు ఇలా చెప్పుకుంటు పోతే చాలానే ఉన్నాయి. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా అనంతపురం శంఖారావం సభలో ఈ విషయాలను చెప్పకనే చెప్పారు. తాను ఒక్క చంద్రబాబుతో పోరాటం చేయలేదని.. చంద్రబాబుకు సంబంధించిన యెల్లో మీడియాతో కూడా మనం పోరాటం చేస్తున్నాం. ఈనాడుతో పోరాటం చేస్తున్నాం. ఆంధ్రజ్యోతితో పోరాటం చేస్తున్నాం. టీవీ5తో పాటు చాలా ఛానల్స్ తో యుద్ధం చేస్తున్నాం అంటూ చెప్పుకుపోయారు.
ఈ మాటల వెనుక చాలానే అర్థాలు కనిపిస్తున్నాయి. ప్రజాసంకల్పయాత్ర పేరిట ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేశారు వైఎస్ జగన్. 341 రోజుల పాటు 3, 648 కిలోమీటర్ల పాటు విసుగు, విశ్రామం లేకుండా పాదయాత్ర చేశారు. ప్రజల సాధక, బాధకాలు తెలుసుకున్నారు. కానీ ఏ ఛానల్ కూడా వాటిని కవర్ చేయలేదు. చేసినా ఏదో ముక్త సరిగా ఇచ్చామా అంటే ఇచ్చామా అన్నట్టు వ్యవహరించారు. ప్రతిపక్ష నేత లెవనెత్తిన ఏ అంశాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రజల తరపున పోరాడలేదు. అంతేనా చంద్రబాబు చెప్పిందే వేదం.. చేసిందే అద్భుతమన్నట్టు వ్యవహరిస్తాయి వైఎస్ఆర్సీపీ నేతలంటారు. అదే ఘటనైనా.. చంద్రబాబుకు అనుకూలంగా వార్తను మలచడానికి ఎల్లో మీడియా చేసే ప్రయత్నం అంతా ఇంతా కాదనేది విపక్ష నేతల మాట.
సోషల్ మీడియా అనేది లేకుంటే ఈ పాటీకి ఏపీ అభివృద్ధిలో ఆకాశాన్నంటిందని చూపించేవారేమో. అంతేనా హోదా కోసం జగన్ చేసిన అలుపెరగని పోరాటాన్ని తక్కువ చేసి చూపించాలన్న ప్రయత్నాలను మరిచిపోలేదో లేక.. ఈ రోజు చంద్రబాబు చేస్తున్న దీక్షకు వారు చేస్తున్న హడావుడిని గమనించారో తెలియదు కానీ.. జగన్ తమ పోరాటం ఎల్లో మీడియాతో కూడా అని వ్యాఖ్యానించారు. వీటన్నింటితో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.