ప్రభుత్వానికి ఉండాల్సిన బలం కన్నా అధికంగా ఉంది.. అవిశ్వాసం పెడితే వెంటనే వీగిపోతుంది.. ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమి లేదు. అయినా ఎన్డీఏ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పార్లమెంట్ సమావేశాలు కొనసాగిస్తూ చివరికి ముగించేసింది. అన్నాడీఎంకేతో కలిసి బీజేపీ పన్నిన వ్యూహం సక్సెస్ఫుల్గా అమలు చేసింది. చివరికి ఎంతో విలువైన పార్లమెంట్ సమయం వృథా అయ్యింది. ప్రజాధనం బూడిదలో పోసినట్టుగా మారింది.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై నిలదీస్తూ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం మొదట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఆ తర్వాత కేంద్రం నుంచి వైదొలిగిన తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చింది. ఇక ఆనాటి నుంచి మొదలైన రాజకీయ డ్రామా శుక్రవారం వరకు కొనసాగింది. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉత్తరాదిని పట్టించుకున్న కేంద్రం దక్షిణాది పట్టించుకోలేదని, ఎన్నికల రాష్ట్రాలకు భారీగా నిధులు కేటాయించిందని ఆరోపణలు వచ్చి ఆందోళనలు చేశారు.
ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో మారిన రాజకీయాల నేపథ్యంలో ప్రత్యేక హోదా డిమాండ్ తీవ్రమైంది. దీనికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఊపిరిపోసి చివరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా చేసింది. దీనిలో తెలుగుదేశం పార్టీ కూడా బలయ్యి ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో కూరుకుపోయింది.
అయితే పార్లమెంట్లో ఏ విధంగా వ్యవహరించాలో ప్రారంభంలోనే ఎన్డీఏ ప్రభుత్వం వ్యూహం రచించింది. తాను వేసిన ప్లాన్లో టీఆర్ఎస్, అన్నాడీఎంకేలు భాగమయ్యాయి. పార్లమెంట్లో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఆందోళనలకు టీఆర్ఎస్, అన్నాడీఎంకే పార్టీలు అడ్డు తగిలాయి. అవిశ్వాసంపై చర్చ చేపట్టడానికి టీఆర్ఎస్, అన్నాడీఎంకే రెండూ సహకరించలేదు. చివరికి టీఆర్ఎస్ కేంద్రం తొత్తుగా విమర్శలు రావడంతో టీఆర్ఎస్ వెనక్కి తగ్గినా అన్నాడీఎంకే పార్లమెంట్లో ఆందోళనలు చేపడుతూనే ఉంది.
కావేరి జలాల బోర్డు ఏర్పాటుచేయాలనే డిమాండ్తో నెల రోజులుగా ఆందోళన చేపడుతోంది. ఆ డిమాండ్ వాస్తవమైనా అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే చర్చించవచ్చు. కానీ అవేమీ పట్టించుకోకుండా కేంద్రానికి తొత్తుగా మారి పార్లమెంట్ సమావేశాలన్నీ నిర్వీర్యం చేసేలా అన్నాడీఎంకే వ్యవహరించింది. పైగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా కావాలని ఉద్దేశపూర్వకంగా చేసింది.
కేంద్రం వ్యూహం ఏమిటంటే:
అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పులన్నీ ప్రతిపక్షాలు నిలదీస్తాయి. ముఖ్యంగా ఇటీవల వరుసగా బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతున్న వారు ఎక్కువయ్యారు. ప్రధానంగా దానిపై చర్చ జరిగే అవకాశం ఉంది.
దేశానికి అవసరమైన అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయి. సభను పొడిగించి అయినా కీలకాంశాలపై చర్చ జరిగేలా చూడాలని విపక్ష పార్టీలు 13 కలిసి లోక్సభ – రాజ్యసభ లసారథులు సుమిత్రా మహాజన్ – వెంకయ్యనాయుడు లను కలిసి విన్నవించిన నేపథ్యంలో కొత్త సంగతులు తెలుస్తున్నాయి.
అవిశ్వాసం గురించిన భయం మాత్రమే కాదు.. మోడీ సర్కారుకు మరిన్ని భయాలు కూడా ఉన్నట్లుగా ఇప్పుడు కొత్త ప్రచారం ప్రారంభమయ్యింది. విపక్షాలు ప్రస్తావించిన అంశాల్లో ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, కావేరీ బోర్డు, బ్యాంకింగ్ కుంభకోణం వంటి అంశాలు ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తదితర ఉన్నాయి. బ్యాంకింగ్ కుంభకోణాలు వంటి అంశాలు చర్చకు రాకూడదని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండడంతో ఈ విధఃగా పార్లమెంట్ సమావేశాలు కొనసాగేలా పరోక్షంగా సహకరిస్తోంది.