ప్రధాని పాత 500-1000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త 500-2000 నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయిన అక్రమ మార్గాల ద్వారా కోట్లకు కోట్లు నోట్లను మార్చుకుంటున్నారు. సామాన్య ప్రజలు డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటే.. నల్లకుబేరులు మాత్రం దర్జాగా ఎక్స్ఛేంజ్ చేసుకుంటున్నారు. అయితే ఇలా కొత్త నోట్లను దాచుకున్నవారు.. అడ్డంగా దొరుకిపోతున్నారు. ఆదాయపన్ను శాఖ, అవినీతి నిరోధక శాఖ, ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ వాళ్ళు అంతా కలిసి దాడులు చేస్తుండడంతో.. కొత్త నోట్లు దాచుకున్న బ్లాక్మనీగాళ్ల గుట్టు ఒక్కొక్కటిగా బయటపడుతోంది.
కొన్ని వారాల వ్యవధిలోనే ఎంతోమంది పట్టుబడ్డారు. ఇలా అందరూ దొరుకుతుండటంతో.. కొత్త 2 వేల నోటుపై ఓ ప్రచారం జరుగుతోంది. ఈ కొత్త 2 వేల నోటులో జీపీఎస్ ఎనేబుల్ చేసిన ఓ ఎలక్ట్రానిక్ చిప్ ఉందని.. దాని ద్వారా కొత్త నోట్లు ఎక్కడ దాచినా అధికారులు ట్రేస్ చేసి నల్లకుబేరులను పట్టుకుంటున్నారని తెలుస్తోంది. అసలు చిప్ లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నా.. ప్రజలు మాత్రం చిప్ ఉందని నమ్ముతున్నారు. దీంతో.. రంగంలోకి కొందరు విశ్లేషకులు దిగి, ఆ చిప్ లేదని క్లారిటీ ఇవ్వడం జరిగింది.
కొత్త నోట్లను దాస్తున్నవారు ఎలా దొరికిపోతున్నారన్న విషయాన్ని కూడా వెల్లడించారు. ఎక్కడైతే కొత్త నోట్లను ముద్రించారో.. అక్కడినుంచి మొదలు ఆ డబ్బు మొత్తం ఎక్కడికి పోతుందో జాగ్రత్తగా పలిశీలిస్తే పట్టుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. కొత్త నోట్లను పట్టుకోవడానికి చిప్ లు అవసరం లేదని.. సాధారణ పద్దతుల ద్వారా తెలిసిపోతుందని అంటున్నారు. బ్యాంకులన్నీ.. తమ బ్యాంక్ లో ఎంత డిపాజిట్ అయింది.. ఎంత విత్ డ్రా.. ఇలాంటివి ప్రతి విషయం ప్రతిరోజూ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకుల సర్వర్లు ఆర్బీఐతో లింక్ అయి ఉంటాయి కాబట్టి.. ఆ వివరాలన్నీ అక్కడ రికార్డ్ అవుతాయి. వీటిలో ఎక్కడ ఏ మాత్రం అనుమానం వచ్చిన వెంటనే ఐటీ, ఈడీ శాఖలకు సమాచారం ఇస్తాయి.
Related