పది జిల్లాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మరిన్ని ఎక్కువ జిల్లాలు కలిగిన రాష్ట్రంగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు నిర్ణయించారు? పాలనా సౌలభ్యం కోసమేనన్న ఓ వాదన వినిపిస్తున్నా… ఇందులో మరో రాజకీయ కోణం కూడా లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.
దసరా పర్వదినాన పది జిల్లాలతో కూడిన తెలంగాణ… 31 జిల్లాలున్న రాష్ట్రంగా అవతరించనుంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న 21 జిల్లాలను ఇప్పటికే ఖరారు చేసిన తెలంగాణ కేబినెట్… గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చేత కూడా ఆమోద ముద్ర వేయించింది. ఇక దసరా రోజున కొత్త జిల్లాలను ప్రకటించడమే తరువాయిగా మారింది.ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకే కేసీఆర్ కొత్త జిల్లాల రాగం అందుకున్నప్పటికీ… విపక్ష పార్టీల్లోని బలమైన నేతలను వారి వారి సొంత నియోజకవర్గాల్లోనే వీక్ చేసేందుకు కేసీఆర్ పెద్ద కసరత్తే చేసినట్లు కనిపిస్తోంది.
టీఆర్ఎస్, ఆ పార్టీ మిత్రపక్షాలు మినహా ఇతర పార్టీలకు చెందిన నేతలు, తనకు కొరుకుడు పడని నేతలను బలహీనం చేసే కసరత్తును కేసీఆర్ షురూ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఇప్పటిదాకా ఉన్న జిల్లాల రూపురేఖలు సమూలంగా మారనున్నాయి. ఫలితంగా ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాల పరిధి కూడా మారక తప్పదు. కేసీఆర్ చతురతను ప్రదర్శించారు. తన రాజకీయ ప్రత్యర్థులకు సంబంధించిన నియోజకర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కేసీఆర్… వాటిని ముక్కలు చెక్కలు చేయనున్నారు.
పాలమూరు జిల్లాలోని రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్నే తీసుకుంటే… సదరు నియోజకవర్గంలో రేవంత్ రెడ్డికి మంచి పట్టుంది. కొత్త జిల్లాల పేరిట పాలమూరు జిల్లా మూడు ముక్కలు అవుతోంది. దీంతో కొడంగల్లోని ఒక్కో మండలం ఒక్కో జిల్లాలోకి వెళుతోందట. దీంతో కొడంగల్ పేరిట నియోజకవర్గమే లేని పరిస్థితి నెలకొన్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఒకవేళ కొడంగల్ పేరిట అసెంబ్లీ నియోజకవర్గాన్ని కొనసాగించినా… ఆ నియోజకవర్గంలో ఇప్పుడున్న కొన్ని మండలాలు ఇతర నియోజకవర్గాలకు వెళ్లిపోక తప్పదు. అదే సమయంలో వాటి స్థానంలో కొడంగల్ లోకి కొన్ని కొత్త మండలాలు చేరక తప్పదు. దీంతో ఇతర నియోజకవర్గాలకు రేవంత్ బలగమంతా వెళ్లిపోతే… కొత్తగా వచ్చే మండలాల జనం ఆయనను ఎలా స్వీకరిస్తారన్నది సమాధానం దొరకని ప్రశ్న. టీ టీడీపీకే చెందిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య (ఖమ్మం జిల్లా సత్తుపల్లి), కాంగ్రెస్ పార్టీకి చెందిన దామోదర రాజనర్సింహ (మెదక్ జిల్లా ఆందోల్), జె. గీతారెడ్డి (మెదక్ జిల్లా జహీరాబాద్), మల్లు భట్టివిక్రమార్క (ఖమ్మం జిల్లా మధిర)లకు కూడా గట్టి ఎదురుదెబ్బే తగలనుందన్న వాదన వినిపిస్తోంది. ఒక్క రేవంత్ రెడ్డి మినహా మిగిలిన వారంతా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన బలమైన నేతలు.
కొత్త జిల్లాల ఏర్పాటుతో వారి వారి నియోజకవర్గాల విభజన జరగకున్నా… జనాభా ప్రాతిపదికన రిజర్వ్డ్ కేటగిరీ అసెంబ్లీ స్థానాలు మారక తప్పని పరిస్థితి. అంటే ప్రస్తుతం వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీ సీట్లు జనరల్ కేటగిరీకి మారితే… వారు ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీ కిందకు మారే స్ధానాలకు వలస పోక తప్పదు. వెరసి కొత్త నియోజకవర్గాలకు వెళ్లే వారి విజయావకాశాలు భారీగా సన్నగిల్లక తప్పదు.
Related