ఆసియా కప్లో తనకి తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించుకుంది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో శుక్రవారం అర్ధరాత్రి ముగిసిన ఫైనల్ మ్యాచ్లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన భారత్ జట్టు 3 వికెట్ల తేడాతో గెలిచి వరుసగా రెండోసారి టైటిల్ని చేజిక్కించుకుంది
ఢాకా వేదికగా 2016లో జరిగిన ఆసియా కప్ ఫైనల్లోనూ బంగ్లాదేశ్ని ఓడించే భారత్ జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. సుదీర్ఘ ఆసియా కప్ చరిత్రలో టీమిండియా విజేతగా నిలవడం ఇది ఏడోసారి కావడం విశేషం.
ఈ మ్యాచ్లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ అద్భుత సెంచరీ (121) సాధించాడు. ఒక దశలో ప్రత్యర్థి జట్టు 300కు పైగా పరుగులు సాధిస్తుందని భావించారు. అయితే, భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి బ్యాట్స్మెన్ను కట్టడి చేశారు. 120 పరుగుల వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోని బంగ్లాదేశ్ ఆ తర్వాత మరో వంద పరుగులకే ఆలౌట్ అవడం గమనార్హం.
బంగ్లా బ్యాట్స్మెన్లలో సెంచరీ వీరుడు లిటన్ దాస్ తర్వాత చెప్పుకోదగ్గ స్కోరు చేసింది మెహిదీ హసన్ (32), సౌమ్య సర్కారు (33) మాత్రమే. మిగతా వారెవరూ పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, కేదార్ జాదవ్ 2 వికెట్లు తీసుకోగా, బుమ్రా, చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు.
అనంతరం 223 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ చివరి బంతికి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (48), శిఖర్ ధవన్ (15) శుభారంభాన్ని ఇచ్చినప్పటికీ వారిద్దరూ అవుటైన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు (2) కూడా నిరాశ పరచడంతో మ్యాచ్ భారత్ చేజారినట్టు కనిపించింది.
దీంతో.. ఒత్తిడిలో పడిన భారత జట్టుని మహేంద్రసింగ్ ధోని (36: 67 బంతుల్లో 3×4), దినేశ్ కార్తీక్ (37: 61 బంతుల్లో 1×1, 1×6) జోడీ కీలక భాగస్వామ్యంతో కాసేపు నడిపించింది. జట్టు స్కోరు 137 వద్ద కార్తీక్, 160 వద్ద ధోనీ ఔటవడంతో మళ్లీ భారత్పై ఒత్తిడికి పెరిగింది. అయితే.. ఆఖర్లో భారత్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ బాధ్యతాయుతంగా ఆడారు. బంతులు, పరుగుల మధ్య అంతరం తరిగిపోతున్నా రవీంద్ర జడేజా (23), భువనేశ్వర్ కుమార్ (21), కేదార్ జాదవ్ (23 నాటౌట్: 27 బంతుల్లో 1×4), కుల్దీప్ యాదవ్ (5 నాటౌట్) సహనంతో బ్యాటింగ్ చేసి భారత్ని విజయతీరాలకి చేర్చారు.
చివరి ఓవర్లో భారత్ విజయానికి ఆరు పరుగులు అవసరం కాగా, వరుసగా 1,1,2,0,1 వచ్చాయి. చివరి బంతికి లెగ్ బై రావడంతో భారత్ విజయం సాధించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్ 2, రెబెల్ హొస్సైన్ 2 వికెట్లు తీసుకోగా, నజ్ముల్ ఇస్లాం, మోర్తాజా, మహ్మదుల్లా చెరో వికెట్ తీసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సెంచరీ వీరుడు లిటన్ దాస్కు దక్కగా, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును శిఖర్ ధవన్ అందుకున్నాడు.
India win the Asia Cup! 👏👏
They win by three wickets off the last ball!
A fitting end to a wonderfully exciting tournament. #AsiaCup
— ICC (@ICC) September 28, 2018