టీమిండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ తనలో బ్యాటింగ్ టాలెంట్ కూడా ఉందని వెల్లడించాడు. ఆదివారం కటక్ వేదికగా వెస్టిండిస్తో జరిగిన మూడో వన్డేలో 4 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ కోహ్లీ ఔటైన తర్వాత జడెజాతో కలిసి పేసర్ శార్దూల్ ఠాకూర్ టీమిండియాకు విజయాన్ని అందించాడు.
మ్యాచ్ అనంతరం శార్దూల్ మాట్లాడుతూ “కోహ్లీ ఔటైన తర్వాత నేను ఒత్తిడికి లోనవుతానని భావించా. కానీ, రవీంద్ర జడేజా రూపంలో ఓ బ్యాట్స్మన్ క్రీజులోనే కుదురుకుని ఉన్నాడు. దీంతో బరిలోకి దిగిన వెంటనే బంతిని వదలకుండా బాదాలని నిర్ణయించుకున్నా. అదృష్టవశాత్తూ బంతి బ్యాట్కు కనెక్ట్ అయింది. బ్యాటింగ్ కూడా చేయగలనని నాకు తెలుసు” అని పేర్కొన్నాడు.
ఇక, ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయగలరా? అన్న ప్రశ్నకు “ఆ స్థానంలో బ్యాటింగ్ చేయగలను. జట్టుకు అవసరమైనప్పుడు నేను 20-30 పరుగులు సాధిస్తే ఎంతో సంతోషిస్తా. బ్యాటింగ్పై కూడా మరింత ప్రాక్టీస్ చేయాలి. నాకు అవకాశం ఇస్తే సద్వినియోగం చేసుకుంటా” అని శార్దూల్ తెలిపాడు. ఇక వీరిద్దరూ కలిసి 30 పరుగులు జోడించడంతో ఎనిమిది బంతులు మిగిలుండగానే టీమిండియా విజయాన్ని కైవసం చేసుకుంది.