నిదహాస్ ముక్కోణపు టి20 టోర్నీ ప్రారంభ మ్యాచ్లో శ్రీలంక చేతిలో ఎదురైన పరాజయానికి భారత్ బదులు తీర్చుకుంది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ముందుగా ప్రత్యర్థిని కట్టడి చేసి… తర్వాత పెద్దగా ఇబ్బంది పడకుండానే లక్ష్య ఛేదనను పూర్తి చేసింది
కొలంబో వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో లంకపై ఘనవిజయం సాధించింది టీమిండియా. మనీశ్ పాండే (42 నాటౌట్: 31 బంతుల్లో 3×4, 1×6), దినేశ్ కార్తీక్ (39 నాటౌట్: 25 బంతుల్లో 5×4) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో 153 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
అంతకముందు ఫాస్ట్ బౌలర్లు శార్ధూల్ ఠాకూర్ (4/27), వాషింగ్టన్ సుందర్ (2/21) ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు వర్షం కారణంగా కుదించిన 19 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులకే పరిమితమైంది.
ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ (11: 7 బంతుల్లో 1×4, 1×6) మరోసారి నిరాశ పరిచారు. మంచి ఫామ్లో ఉన్ శిఖర్ ధావన్కూడా (8) తొందరగానే ఔటవడంతో భారత్ ఆదిలోనే 22/2తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా (27: 15 బంతుల్లో 2×4, 2×6).. కేఎల్ రాహుల్ (18: 17 బంతుల్లో 1×4)తో కలిసి కాసేపు స్కోరు బోర్డుని నడిపించాడు. రన్రేట్ పడిపోకుండా స్పీడ్గా ఆడారు.
జట్టు స్కోరు 62 వద్ద రైనా ఔటవగా.. తర్వాత కొద్దిసేపటికే కేఎల్ రాహుల్ హిట్ వికెట్గా ఔటై అందర్నీ ఆశ్చర్యపరిచాడు. భారత్ తరఫున టీ20ల్లో హిట్ వికెట్గా ఔటైన తొలి క్రికెటర్ కేఎల్ రాహుల్ నిలిచాడు. స్పిన్నర్ జీవన్ మెండిస్ బౌలింగ్ వెనక్కి వెళ్లి ఆడే ప్రయత్నంలో.. రాహుల్ వికెట్లను తొక్కేశాడు. ఈ దశలో మనీశ్ పాండే – దినేశ్ కార్తీక్ జోడి భారత్ని గెలిపించే ఇన్నింగ్స్ ఆడింది. వీరిద్దరూ ఐదో వికెట్కి అజేయంగా 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్కి అలవోక విజయం అందించారు. తొలుత మనీశ్ పాండే హిట్టింగ్తో మ్యాచ్ని భారత్వైపు తిప్పగా.. చివర్లో వరుస బౌండరీలతో గెలుపు లాంఛనాన్ని దినేశ్ కార్తీక్ పూర్తి చేశాడు.
మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 19 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్ కుశాల్ మెండిస్ (38 బంతుల్లో 55; 3 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడి మంచి ప్రారంభాన్నిచ్చాడు. మధ్యలో తరంగ (24 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్), చివర్లో షనక (19) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ శార్దుల్ ఠాకూర్ (4/27) చెలరేగగా, వాషింగ్టన్ సుందర్ (2/21) మరోసారి పొదుపైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. అనంతరం భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లకు 153 పరుగులు చేసింది. చివర్లో భారత్ క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ లంకపై ఒత్తిడి పెంచింది. శనక (19), జీవన్ మెండిస్ (1), అఖిల ధనంజయ (5), చమీర (0) వరుసగా వికెట్లు చేజార్చుకోవడంతో ఆ జట్టు 152 పరుగులకే పరిమితమైంది.