సెంచూరియన్ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టు రసవత్తరంగా మారింది. రెండో టెస్టు అనేక మలుపుల తర్వాత రెండో రోజు దాదాపు సమాన స్థితిలో నిలిచింది. ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.
ఐదు వికెట్లు తీసిన సౌతాఫ్రికా ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నించగా.. మరో వికెట్ పడకుండా కోహ్లి, పాండ్య జాగ్రత్త పడటంతో భారత్ మ్యాచ్లో నిలిచింది. రెండో రోజు 164 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోవడంతో కెప్టెన్ విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్య కలిసి ప్లాన్ ప్రకారం ఆడారు. సఫారీ బౌలర్లకు వికెట్ దక్కకుండా జాగ్రత్త వహించారు.
ప్రొటీస్ బౌలర్ల రివర్స్ స్వింగ్ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి గతంలో రాహుల్-సచిన్ తరహా వ్యూహాన్ని అనుసరించారు. ఇన్స్వింగర్లు, ఔట్స్వింగర్లను కలగలిపి విసిరిన మోర్కెల్, లుంగీ ఎన్గిడి పాండ్యను ఔట్ చేయడానికి తీవ్రంగా శ్రమించారు. కానీ క్లోహి వ్యూహంతో వారి ప్రయత్నాలు వృథా అయ్యాయి.
నాన్ స్ట్రయికర్ ఎండ్లో ఉన్న కోహ్లి సౌతాఫ్రికా బౌలర్ల రివర్స్ స్వింగ్ డెలివరీలను ముందే గుర్తించి పాండ్యను అప్రమత్తం చేశాడు. బంతి మెరుస్తున్న వైపు బ్యాట్స్మెన్కు దూరంగా పడితే అది ఔట్ స్వింగర్.. ఆ టైంలో నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉన్న కోహ్లి ఎడమ చేతితో బ్యాట్ను పట్టుకునేవాడు. బౌలర్ ఇన్స్వింగర్ విసురుతాడని గుర్తిస్తే కోహ్లి బ్యాట్ను కుడి చేతిలోకి మార్చేవాడు. దీంతో బౌలర్ ఏ బంతిని విసురుతాడనే విషయమై పాండ్యకు ముందే అర్థమైపోయింది. దీంతో ఇంకో వికెట్ పడకుండా ఇద్దరూ నిలకడగా ఆడుతున్నారు. భారత్ రెండో టెస్ట్లో నిలబడాలంటే కోహ్లీ, పాండ్యా మీదనే ఆధార పడింది.