ఇంగ్లండ్తో తొలి టెస్టును తృటిలో చేజార్చుకున్న టీమిండియా రెండో టెస్ట్కు సిద్దమైంది. ఆగస్టు 9 నుంచి లార్డ్స్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. మొదటి టెస్ట్లో ఓడిన టీమిండియా రెండో టెస్టులో ఎలాగైనా నెగ్గాలనే కసితో ఉంది. గురువారం నుంచి లార్డ్స్ వేదికగా ఈ టెస్టు ప్రారంభం కానుంది.
ఈ ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇప్పటి వరకు సారథ్య బాధ్యతలు వహించిన ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే విజయాలందుకున్నారు. లార్డ్స్లో టీమిండియా 17 టెస్టులు ఆడితే రెండింట్లో విజయం సాధించింది, 11 మ్యాచ్ల్లో ఓడింది. క్రికెట్ మక్కాగా పేరొందిన ఈ గ్రౌండ్లో 13 మంది కెప్టెన్ల నాయకత్వంలో భారత్ టెస్టులు ఆడితే.. కేవలం ఇద్దరే విజయం సాధించారు. అప్పుడెప్పుడో కపిల్ దేవ్ సారథ్యంలో నెగ్గిన టీమిండియా.. తర్వాత ధోనీ నాయకత్వంలో గెలుపొందింది. ప్రస్తుతం విరాట్ కోహ్లి వంతు వచ్చింది.
లార్డ్స్లో కోహ్లి విజయం సాధిస్తాడా లేదా అనే విషయం చర్చనీయాంశమైంది. లార్డ్స్ మైదానంలో విజయం సాధించి ఆ ఘనత సాధించిన మూడో కెప్టెన్గా కోహ్లి మాజీ సారథుల సరసన నిలుస్తాడో లేదో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
1932లో సీకే నాయుడు నాయకత్వంలో భారత్ లార్డ్స్లో తొలి టెస్టు ఆడింది. 158 పరుగుల తేడాతో టీమిండియా ఆ మ్యాచ్ను చేజార్చుకుంది. లార్డ్స్ టెస్ట్ విజయం కోసం భారత్ 1986 వరకు వేచి చూడాల్సి వచ్చింది. కపిల్ కెప్టెన్సీలోని భారత జట్టు ఇంగ్లాండ్పై ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది.
1986 విజయం తర్వాత భారత్ ఈ వేదికపై ఐదు టెస్టు ఆడినప్పటికీ.. గెలవలేకపోయింది. మళ్లీ 2014లో ధోనీ నాయకత్వంలోని భారత జట్టు 95 రన్స్ తేడాతో అలిస్టర్ కుక్ సారథ్యంలోని ఇంగ్లాండ్ను ఓడించింది. 74 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టిన ఇషాంత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు.
భారత్కు ప్రపంచకప్ అందించిన సారథులే లార్డ్స్లో విజయాలు నమోదు చేయడం విశేషం. మళ్లీ ఇన్నాళ్లకు విరాట్ కోహ్లి నాయకత్వంలో భారత్ లార్డ్స్ మైదానంలో టెస్టు ఆడబోతోంది. లాడ్స్లో గెలిచి కపిల్, ధోనీ సరసన కోహ్లీ చేరుతారా అన్నది వేచి చూడాల్సిందే.