దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీ సాధించాడు. ఐదు వికెట్ల నష్టానికి 183 పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్.. కాసేపటికే రెండొందల పరుగుల మార్క్ దాటింది. ఆ తర్వాత వెంటనే కోహ్లి కూడా శతకం పూర్తి చేసుకున్నాడు. రబాడ బౌలింగ్లో రెండు పరుగులు తీయడం ద్వారా కోహ్లి దక్షిణాఫ్రికాలో తొలి సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు.
సచిన్ తర్వాత సఫారీ గడ్డ మీద సెంచరీ చేసిన రెండో భారత కెప్టెన్గా విరాట్ రికార్డ్ నెలకొల్పాడు. 146 బంతుల్లో పది ఫోర్ల సాయంతో కోహ్లి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 1996-97 సిరీస్లో సచిన్ కెప్టౌన్ టెస్టులో 169 పరుగులు చేశాడు.
విరాట్కు టెస్టుల్లో ఇది 21వ సెంచరీ కావడం గమనార్హం. సొంత గడ్డ మీద 52 ఇన్నింగ్స్లో 10 సెంచరీలు చేసిన కోహ్లి, విదేశాల్లో 57 ఇన్నింగ్స్ల్లో 11 సెంచరీలు సాధించాడు.
మూడో రోజు 85 పరుగులతో ఆట ప్రారంభించిన కోహ్లి లుంగీ బౌలింగ్లో వరుసగా రెండు బౌండరీలు బాది సెంచరీకి చేరువయ్యాడు. సెంచరీ పూర్తికాక ముందే కోహ్లి సెంచూరియన్లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ కెప్టెన్గా రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డ్ ధోనీ (90) పేరిట ఉండగా కోహ్లి దాన్ని అధిగమించాడు
భారత బ్యాట్స్ మెన్లో మురళీ విజయ్ 46, లోకేశ్ రాహుల్ 10, చటేశ్వర పుజారా 0 (రనౌట్), రోహిత్ శర్మ 10, పార్థివ్ పటేల్ 19, హార్థిక్ పాండ్యా (రనౌట్) 15 చేయగా విరాట్ కోహ్లీ 103, రవిచంద్రన్ అశ్విన్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా స్కోరు 209/6(67 ఓవర్లకి)గా ఉంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, మార్కెల్, రబాడా, గిడి లకు తలో వికెట్ దక్కాయి. కాగా, దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 335 పరుగులకి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.