సఫారీ గ డ్డపై భారత్ చరిత్ర సృష్టించేందుకు కోహ్లీసేన ఒక్క అడుగుదూరంలో ఉంది. ఆరు వన్డేల సిరీస్లో ఇప్పటికే 3-0ఆధిక్యంలో ఉన్న టీమిండియా సిరీష్పై కన్నేసింది. ఒక్క మ్యచ్ గెలుస్తే చాలు వన్డేసిరీస్ను కైవసం చేసుకోవడంతోపాటు నెంబర్ వన్ ర్యాంక్ను పదిలం చేసుకుంటుంది.
దాదాపు రెండున్నరేళ్ల క్రితం భారత పర్యటనలో టెస్టు సిరీస్లో చిత్తుగా ఓడిన దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ను మాత్రం తమ ఖాతాలో వేసుకొని తిరిగి వెళ్లింది. ఇప్పుడు ఆ లెక్క సరి చేయడంతో పాటు సఫారీ గడ్డపై మొదటి సిరీస్ గెలుచుకునేందుకు కోహ్లి సేన ఉత్సాహంగా ఉంది. ఇప్పుడు చివరి టెస్టులో భారత్కు విజయాన్నందించిన జొహానెస్బర్గ్లోనే చారిత్రక సిరీస్ విజయం సాధించడానికి అవకాశం వచ్చింది.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో ఇప్పటికే అగ్రస్థానానికి చేరిన భారత్, ఆ ర్యాంకును నిలబెట్టుకుంటుంది. సిరీస్లో మిగతా రెండు మ్యాచ్లు ఓడినా ర్యాంకు మారదు. ఒకరి తర్వాత ఒకరు కీలక ఆటగాళ్లు దూరం కావడంతో ప్రదర్శన తీసికట్టుగా తయారైన దక్షిణాఫ్రికా.. నాలుగో వన్డేలో ఎలా ఆడుతుందో చూడాలి. ఏబీ డివిలియర్స్ పునరాగమనం ఆ జట్టుకు మాత్రం ఊరటనిచ్చే విషయం అనే చెప్పాలి.
ఇక ఈ పర్యటనలో భారత బ్యాటింగ్ అంతా కెప్టెన్ విరాట్ చుట్టూనే తిరుగుతోంది. వన్డే సిరీస్లో అతను చెలరేగిపోతున్నాడు. ముఖ్యంగా మూడో వన్డేలో కెరీర్లోనే నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడతను. ధావన్ కూడా ఫామ్ అందుకుని సత్తా చాటుతున్నాడు. ఐతే రోహిత్ వైఫల్యమే కలవరపరుస్తోంది.
మూడు వన్డేల్లో అతను 20, 15, 0 చొప్పున పరుగులు చేశాడు. కాబట్టి ఈ మ్యాచ్లో అతను రాణించడం అవసరం. కేదార్ జాదవ్ తనకు లభించిన ఒక్క అవకాశాన్ని వృథా చేసుకోగా… హార్దిక్ పాండ్యా ముద్ర అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో ఎక్కడా కనిపించలేదు. వరుస విజయాలు తెచ్చిన జోరును మరో మ్యాచ్లో కొనసాగిస్తే టీమిండియా సగర్వంగా కాలరెగరేయవచ్చు.
టీమిండియా ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా దిగుతోంది. ఇక బైలర్ల విషయానికి వస్తే ఇద్దరు లెగ్ స్పిన్నర్లు చహల్, కుల్దీప్ ప్రతీ మ్యాచ్లో ప్రత్యర్థి పతనాన్ని శాసిస్తే… పేసర్లు భువనేశ్వర్, బుమ్రా కూడా తమ పాత్రను సమర్థంగా పోషిస్తున్నారు. తొలి మూడు వన్డేల్లో కలిపి దక్షిణాఫ్రికా 28 వికెట్లు కోల్పోతే అందులో 21 వీళ్లిద్దరి ఖాతాలోనే చేరాయి. పేసర్ల నిలయాలైన దక్షిణాఫ్రికా పిచ్లపై స్పిన్నర్లు ఈ స్థాయిలో హవా సాగించడం అనూహ్యం. అందులోనూ చివరి రెండు వన్డేల్లో వారి ధాటికి ప్రత్యర్థి బ్యాట్స్మెన్ విలవిలలాడిపోయారు. ఈ రోజు జరిగే మ్యాచ్లో మరో సారి బైలర్లు, బ్యాట్స్మేన్ రాణిస్తే సిరీస్ భారత్ వశ మవుతుంది.
జట్ల వివరాలు తుది అంచనా..
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రహానే, పాండ్యా, జాదవ్, ధోని, భువనేశ్వర్, కుల్దీప్, బుమ్రా, చహల్.
దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), ఆమ్లా, డుమిని, డివిలియర్స్, బెహర్దీన్, మిల్లర్/ జోండో, మోరిస్, ఫెలుక్వాయో, రబడ, మోర్కెల్, తాహిర్.