ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న ఢిల్లీ జట్టు చివర్లో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఐపీఎల్ 2018 సీజన్లో పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్కు ఎవరూ ఊహించని షాక్ ఇచ్చింది ఢిల్లీ డేర్ డేవిల్స్. ఫిరోజ్ షా కోట్ల వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో చెన్నైపై 34 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
తొలుత హర్షల్ పటేల్ (36 నాటౌట్: 16 బంతుల్లో 1×4, 4×6), విజయ్ శంకర్ (36 నాటౌట్: 28 బంతుల్లో 2×4, 2×6) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసిన ఢిల్లీ.. అనంతరం బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఛేదనకు దిగిన చెన్నైని 128/6కే పరిమితం చేసింది.
చెన్నై జట్టులో ఓపెనర్ అంబటి రాయుడు (50: 29 బంతుల్లో 4×4, 4×6), రవీంద్ర జడేజా (27 నాటౌట్: 18 బంతుల్లో 2×6) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (17: 23 బంతుల్లో 1×4), సురేశ్ రైనా (15: 18 బంతుల్లో 1×4) మిడిల్ ఓవర్లలో ఆశించినంత వేగంగా ఆడలేకపోవడంతో ఆఖర్లో బంతులు, పరుగుల మధ్య అంతరం భారీగా పెరిగిపోయి చెన్నై ఓటమి ఖాయమైంది. అయితే.. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్ చేరిన విషయం తెలిసిందే.
అంతకముందు ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా (17: 17 బంతుల్లో 1×4, 1×6) ఆరంభంలోనే ఔటవగా.. అనంతరం వచ్చిన రిషబ్ పంత్ (38: 26 బంతుల్లో 3×4, 2×6)తో కలిసి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (19: 20 బంతుల్లో 3×4) కాసేపు ఇన్నింగ్స్ నడిపించినా.. ధాటిగా ఆడలేకపోయాడు. వీరిద్దరినీ రెండు బంతుల వ్యవధిలో ఎంగిడి ఔట్ చేయగా.. తర్వాత వచ్చిన హిట్టర్లు మాక్స్వెల్ (5), అభిషేక్ శర్మ (2) పేలవరీతిలో వికెట్ చేజార్చుకున్నారు.
ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన డ్వేన్ బ్రావో బౌలింగ్లో విజయ్ శంకర్ ఒక సిక్సర్ కొట్టగా.. హర్షల్ పటేల్ కళ్లు చెదిరే రీతిలో మూడు సిక్సర్లు బాదడంతో.. ఆ ఓవర్లో 26 పరుగులు వచ్చాయి. దీంతో గౌరవ ప్రదమైన స్కోరును ఢిల్లీ సాధించింది.