వన్డే ప్రపంచకప్ తుది అంకానికి చేరింది. ఇవాళ జరిగే ప్రపంచకప్ ఫైనల్లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా తలపడనున్నాయి. గుజరాత్లోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుండగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు సెలబ్రెటీలు ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ఇక హై ఓల్టేజ్ మ్యాచ్లో భారత్ గెలిచి మూడోసారి ప్రపంచకప్ను చేజిక్కించుకోవాలని యావత్ భారతావని ఎదురుచూస్తోంది.
ఇదే అహ్మదాబాద్ పిచ్ లీగ్ మ్యాచ్లో కంగారులను మట్టికరిపించిన రోహిత్ సేన మరోసారి ఆ ఫలితాన్నే పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. అహ్మదాబాద్ పిచ్ను పరిశీలించిన తర్వాత అది బ్యాటింగ్కు అనుకూలిస్తుందా… బౌలింగ్కు అనుకూలిస్తుందా టాస్ గెలిస్తే ఏం తీసుకుంటే మంచిదనే దానిపై పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫైనల్కు నల్లమట్టి పిచ్ను ఎంపిక చేస్తే బౌలింగ్కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఎర్రమట్టితో కూడిన పిచ్ను ఎంపిక చేస్తే బాల్ చాలా నెమ్మదిగా బ్యాట్పైకి వస్తుంది. ఫైనల్ లాంటి మెగా ఈవెంట్లకు నల్లమట్టి పిచ్నే ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ఇక ఇరు జట్లకు టాస్ కీలకం కానుంది.
అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియా…ఆరోసారి కప్ ఎగరేసుకపోవాలని ఉవ్విళ్లూరు తుండగా ఆసిస్లో బలమైన స్పిన్నర్లు లేకపోవడం టీమిండియాకు బలంగా మారే అవకాశం ఉంది. అయితే అహ్మదాబాద్ పిచ్పై టార్గెట్ చేధించడం కష్టం కావడంతో టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవడం బెటర్ అని అభిప్రాయం వ్యక్తమవుతుండగా టాస్ ఎవరు గెలుస్తారోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.