ప్రపంచకప్ టోర్నీ తొలి పోరులోనే శ్రీలంక బ్యాట్స్మెన్ ఘోరంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 29.2 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది.న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి లంక బ్యాట్స్ మేన్లు విలవిల్లాడారు. ఈ ప్రపంచ కప్లో ఇది రోండో అత్యల్ప స్కోరు. వరల్డ్కప్ వామప్ మ్యాచ్లో టీమిండియాకు చుక్కలు చూపించిన న్యూజిలాండ్ బౌలర్లు… శ్రీలంక జట్టును ఓ ఆటాడుకున్నారు
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లంక 29.2 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది. కెప్టెన్ కరుణరత్నే (52 నాటౌట్) అజేయ అర్థసెంచరీతో పోరాడడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. మొదటి బంతికి ఫోర్ కొట్టిన ఓపెనర్ లహీరు తిరిమన్నే… రెండో బంతికి పెవిలియన్ చేరాడు. అంపైర్ నాటౌట్గా ప్రకటించినా రివ్యూకి వెళ్లిన కివీస్ కెప్టెన్కు అనుకూలంగా ఫలితం వచ్చింది.ఆ తర్వాత కుశాల్ పెరేరా, కరుణరత్నే కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే 29 పరుగులు చేసిన పెరేరాను అవుట్ చేసిన మ్యాట్ హెన్రీ… కుశాల్ మెండీస్ను డకౌట్ చేశాడు. దనంజయ డి సిల్వా 4 పరుగులు చేయగా, ఏంజిలో మ్యాథ్యూస్ 9 బంతులాడి డకౌట్ అయ్యాడు.
ఆ జట్టులో ఎనిమిది మంది సింగిల్ డిజిట్ స్కోరుకు పరిమితమయ్యారు. పిచ్ పై పచ్చికను సద్వినియోగం చేసుకున్న న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లు మాట్ హెన్రీ, లాకీ ఫెర్గుసన్ చెరో 3 వికెట్లతో లంకేయుల పనిబట్టారు. లంక ఇన్నింగ్స్ లో కుశాల్ పెరెరా 29, తిస్సర పెరెరా 27 పరుగులు చేశారు.