భారత క్రికెటర్ల వార్షిక వేతనాలు భారీగా పెరిగాయనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జీతాల పెంపు అంశంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ తాత్కాలిక సెక్రటరీ సీకే ఖన్నా తెలిపారు. క్రికెటర్ల శాలరీ అంశం ఇంకా చర్చల పరిధిలో ఉందని స్పష్టం చేశారు.
త్వరలో జరిగే సర్వసభ్య సమావేశం(ఎస్జీఎమ్)లో చర్చించాల్సి ఉందన్నారు. ‘క్రికెటర్ల శాలరీ పెంపు అంశాన్ని పరిశీలిస్తున్నాం. దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఎస్జీఎమ్లో బీసీసీఐ ఫైనాన్స్ కమిటీతో చర్చించిన తరువాత మాత్రమే తుది నిర్ణయం ఉంటుంది’ అని సీకే ఖన్నా తెలిపారు.
ఇప్పటివరకూ బీసీసీఐ వార్షిక రెవెన్యూలో రూ. 180 కోట్లను క్రికెటర్లకు కేటాయిస్తుండగా, దానికి అదనంగా మరో రూ. 200 కోట్లను చేర్చాలని పరిపాలకుల కమిటీ(సీఓఏ) యోచిస్తోంది. తద్వారా క్రికెటర్లకు ఇప్పుడు తీసుకుని వార్షిక జీతం మీద రెట్టింపు చేయాలనేది సీఓఏ ఆలోచన. గతంలో జీతాల పెంపు అంశంగురించి సీఓఏతో సమావేశమైన కోహ్లి, ఎంఎస్ ధోని, కోచ్ రవిశాస్త్రిలు ఆటగాళ్ల శాలరీ పెంపుపై చర్చించారు. శాలరీల పెంపునకు సీఓఏ సానుకూలత వ్యక్తం చేయడంతో ఈవిషయాన్ని బీసీసీఐ ఫైనాన్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్లింది. త్వరలోనే జీతాల పెంపుపై ఒక స్పష్టత వస్తుంది.