క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్లు అనేకం వెలుగులోకి వచ్చాయి. అయితె ఇప్పుడు మరోకొత్త మ్యాచ్ ఫిక్సింగ్ భూతం వెలుగులోకి వచ్చింది. భారత్,న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే పూణె స్టేడియంలో జరగనుంది. ఇండియా టుడే’ విలేకరులు కొందరు న్యూజిలాండ్ తో నేడు భారత్ క్రికెట్ మ్యాచ్ ఆడనున్న పుణె స్టేడియంకు బుకీల మాదిరిగా వెళ్లి పిచ్ క్యూరేటర్ పై జరిపిన స్టింగ్ ఆపరేషన్ క్రికెట్లో తీవ్ర ప్రకంపనలు పుట్టిస్తోంది.
స్టింగ్ ఆపరేషన్లో క్యూరేటర్ పాండురంగ సల్గొంకర్ మాట్లాడిన మాటల వీడియో, ఆడియో, భారత క్రికెట్ లో మరోసారి ఫిక్సింగ్ భూతాన్ని వెలుగులోకి తెచ్చింది. మరికొన్ని గంటల్లో మ్యాచ్ జరగాల్సి వున్న వేళ, ఇది హైస్కోరింగ్ పిచ్ అని సల్గొంకర్ చెబుతుండటంపై పలువురు సీనియర్ క్రికెటర్లు ఘాటుగా స్పందించారు.
క్యూరేటర్ పై కఠిన చర్యలుంటాయని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా అన్నారు. విషయాన్ని తాము విచారిస్తున్నామని, ఇప్పుడే నిర్ణయం చెప్పమనడం సరికాదని అన్నారు. ఎటువంటి ఫిక్సింగ్, లంచాలను బీసీసీఐ సహించబోదని ఆయన స్పష్టం చేశారు.
మరో బీసీసీఐ అధికారి స్పందిస్తూ, క్రికెట్ నియమ నిబంధనల గురించి ప్రతి అధికారికి, ఉద్యోగికీ తెలుసునని, డబ్బుకోసం ఇలా చేయడం గర్హనీయమని అన్నారు. క్యూరేటర్ పైనా, పుణె స్టేడియం అధికారులు, ఇతరులను పిచ్ మీదకు అనుమతించిన ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించాల్సిందేనని మాజీ కెప్టెన్ అజారుద్దీన్ డిమాండ్ చేశారు.