టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్ సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్ ఇవ్వబోతున్నడనే వార్తలు ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి. త్వరలోనే ముంబై ఇండియన్స్ జట్టులోకి మారిపోనున్నాడనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. సన్ రైజర్స్ యాజమాన్యం వ్యవహారశైలితో అసంతృప్తిగా ఉన్న ధావన్ రాబోయే ఐపీఎల్ సీజన్ లో ఆ జట్టుకు టాటా చెప్పనున్నట్లు తెలుస్తోంది.
ధావన్ 2013 నుంచి సన్ రైజర్స్ తరఫున ఆడుతున్నాడు. అయితే ఇటీవల జరిగిన వేలంలో సన్ రైజర్స్ జట్టు భువనేశ్వర్ కుమార్, ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ లను రిటైన్ చేసుకుంది. ధావన్ ను మాత్రం రైట్ టు మ్యాచ్ కింద తీసుకుంది. ఒకవేళ ధావన్ ను రిటైన్ చేసుకుని ఉంటే ప్రస్తుతం రూ.5.2 కోట్లకు బదులుగా, దాదాపుగా రూ.12 కోట్లు దక్కేవి.
దీంతో తన సహచర ఆటగాళ్లు కోహ్లి(17 కోట్లు), రోహిత్ శర్మ(15 కోట్లు), ధోని(15 కోట్లు)లతో పోలిస్తే తనకు తక్కువ మొత్తం దక్కడంపై ధావన్ అసంతృప్తిగాగా ఉన్నట్లు సమాచారం. త్వరలోనే సన్ రైజర్స్ జట్టుకు టాటా చెప్పి ముంబై ఇండియన్స్ జట్టులో చేరేందుకు ధావన్ ఆసక్తి చూపినట్లు సమాచారం.
ముంబై ఇండియన్స్ జట్టు యజమాన్యంతో ధావన్ చర్చలు జరుపుతున్నారనీ, త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని వార్తలు వచ్చాయి. ఇదే జరిగితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ధావన్ ఓపెనర్ గా బ్యాటింగ్ చేసే అవకాశముంది.