నాగపూర్ లో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ తేడాతో భారీ విజయానికి దగ్గరైంది. తొలి ఇన్నింగ్స్ లో 610 పరుగుల వద్ద భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా, మూడో రోజు ఆటను ఒక వికెట్ నష్టానికి 21 పరుగుల వద్ద ముగించి, నాలుగో రోజు ఆటను ప్రారంభించిన లంకేయులను భారత బౌలర్లు అల్లాడించారు.
లంచ్ విరామ సమయానికే 7 వికెట్లు పడగొట్టారు. ఆశ్విన్ కు మూడు వికెట్లు లభించగా, ఈశాంత్ శర్మ జడేజాలకు తలో రెండు వికెట్లు లభించాయి. ఉమేష్ యాదవ్ ఒక వికెట్ ను పడగొట్టాడు. లంక ఆటగాళ్లలో సమరవిక్రమ, పెరీరా, హెరాత్ డక్కౌట్ కాగా, కరుణరత్నే 18, తిరిమనే 23, మ్యాథ్యూస్ 10, డిక్ వెల్లా 4, శనాక 17 పరుగులకు అవుట్ అయ్యారు.
ప్రస్తుతం చండీమల్ ఒక్కడే ఆఫ్ సెంచరీ చేసి 53 పరుగులతో క్రీజులో పోరాడుతున్నాడు. చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉండటంతో, భారత విజయాన్ని లంక ఆటగాళ్లు అడ్డుకునే పరిస్థితి అసాధ్యమే. ప్రస్తుతం లంక స్కోరు 36 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు. ఈ క్రమంలోనే భారత జట్టు ఇన్నింగ్స్ విజయం సాధించడం దాదాపు ఖాయంగా కనబడుతోంది.