వన్డే ప్రపంచకప్ సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో శ్రీలంక జట్టు బ్యాట్స్మెన్లు తడబడ్డారు. సపారీల దెబ్బకు 49.3 ఓవర్లలో 203 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన లంకేయులకు ఆదిలోనే షాక్ తగిలింది. శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే ఇన్నింగ్స్ తొలి బంతికే ఔటయ్యాడు. రబడా బౌలింగ్లో డుప్లెసిస్కు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్గా ఔటయ్యాడు.సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారిన సమయంలో పట్టుదలతో రాణించాల్సింది పోయి చేతులెత్తేశారు.
ఈ సమయంలో కుశాల్ పెరీరా-అవిష్కా ఫెర్నాండాల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 67 పరుగులు జత చేసిన తర్వాత ఫెర్నాండో(30) రెండో వికెట్గా పెవిలియన్ చేరాడు.కాసేపటికి కుశాల్ పెరీరా(30) కూడా ఔట్ కావడంతో లంక 72 పరుగుల వద్ద మూడో వికెట్ను కోల్పోయింది. అటు తర్వాత కుశాల్ మెండిస్(23), ధనంజయ డిసిల్వా(24), జీవన్ మెండిస్(18), తిషారా పెరీరా(21)లు సైతం నిరాశపరిచారు. చివర్లో ఇసురా ఉదానా(17) ఫర్వాలేదనిపించడంతో లంక 49.3 ఓవర్లలో 203 పరుగులు ఆలౌటైంది.
ప్రధాన ఆటగాళ్లు నిలదొక్కుకుంటున్న దశలో అవుట్ కావడంతో లంక భారీ స్కోరు ఆశలు గల్లంతయ్యాయి. ఓవైపు దక్షిణాఫ్రికా పేసర్లు నిప్పులు చెరిగే బంతులతో పరీక్ష పెట్టడం కూడా లంకేయులను ఇబ్బందులకు గురిచేసింది. ముఖ్యంగా, ప్రిటోరియస్ (3 వికెట్లు), మోరిస్ (3 వికెట్లు), రబాడా (2 వికెట్లు) బాగా బౌలింగ్ చేశారు.