న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న అండర్ -19 ప్రపంచకప్ టోర్నీ.. ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య సమరానికి సర్వం సిద్దమయ్యింది. చరిత్ర పుస్తకాలను తిరగరాసేందుకు మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ విద్యార్థులు సిద్ధమయ్యారు. ఐసీసీ అండర్-19 వన్డే ప్రపంచకప్ ట్రోఫీని రికార్డు స్థాయిలో నాలుగోసారి అందుకోవాలని పృథ్వీషా నేతృత్వంలోని యువ భారత్ ఉవ్విళ్లూరుతోంది.
ఫైనల్ నేపథ్యంలో మీడియాతో శుక్రవారం పృధ్వీషా మాట్లాడుతూ ‘జట్టుకి వికెట్ అవసరమైన ప్రతిసారి ఫాస్ట్ బౌలర్లు సత్తాచాటుతున్నారు. ఏ దశలోనైనా కెప్టెన్గా నేను అడిగితే బౌలింగ్ చేసేందుకు పేసర్లు జట్టులో సిద్ధంగా ఉంటారు. వారి ఫిటెనెస్, నిబద్ధత అమోఘం. బౌలింగ్ సమయంలో పేసర్లు ఫ్రెండ్లీ ఉంటుండటంతో ఫీల్డర్లు కూడా ఉత్సాహంగా ఉంటున్నారు. ఫాస్ట్ బౌలర్లు చెలరేగిన ప్రతిసారి.. జట్టు గెలుస్తోంది. ఫైనల్లోనూ ఆసీస్ భరతం పడతాం’ అని పృధ్వీషా ధీమా వ్యక్తం చేశాడు.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో యువ భారత్ తిరుగులేని విధంగా ఉంది. జట్టు సారథి పృథ్వీషా భారత భవిష్యత్ స్టార్గా అవతరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇంతకు ముందు ప్రపంచకప్లు గెలిచిన మహ్మద్ కైఫ్ (2000), విరాట్ కోహ్లీ (2008), ఉన్ముక్త్ చంద్ (2012) సరసన చేరాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఓపెనర్ మన్జోత్ కార్ల్తో కలిసి జట్టుకు శుభారంభాలు అందించాడు. ఇక వన్డౌన్లో వస్తున్న శుభ్మన్ గిల్ బ్యాటింగ్లో సత్తా చాటుతున్నాడు. మిడిలార్డర్ కూడా బలంగానే ఉంది. బౌలింగ్లో కమలేశ్ నాగర్ కోటి, శివమ్ మావి 140-150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతున్నారు.
ఫైనల్ పోరులో ఇద్దరు ఆటగాళ్లపై అందరి దృష్టి ఉంది. టీమిండియా తరఫున అత్యద్భుత ఇన్నింగ్స్లు ఆడిన శుభ్మన్ గిల్ అందులో ఒకరు. అండర్-19 ప్రపంచకప్లో 170 సగటుతో విజృంభించాడు. ఆస్ట్రేలియా జట్టులో లెగ్స్పిన్నర్ లాయిడ్ పోప్ ఆట ఆసక్తికరం. ఇంగ్లాండ్తో క్వార్టర్లో ఆసీస్ 127 పరుగులకే పరిమితమైంది. అయితే బౌలింగ్లో పోప్ 35 పరుగులిచ్చి 8 వికెట్లు తీసి ఇంగ్లాండ్ను 96కు కుప్పకూల్చాడు. టోర్నీలో ఇప్పటి వరకు 11 వికెట్లు తీశాడు. తుదిపోరులో ఇతడి ఆట కీలకం కానుంది. శనివారం న్యూజిలాండ్లో మధ్యా్హ్నం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది. భారత్లో ఉదయం 6:30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.