పనాజీ: నోట్ల రద్దు విషయాన్ని ప్రధాని మోడీ ప్రకటించిన తర్వాత దేశ వ్యాప్తంగా అది సంచలనం అయ్యింది. ఈ ప్రకటన తర్వాత జపాన్ పర్యటనకు వెళ్లిన మోడీ అక్కడ మోదటి సారిగా ఈ విషయంపై స్పందించారు. దేశ క్షేమం కోసం ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాక కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలు సహకరిస్తున్నారంటూ అందరికీ సలాం చేశారు.
అయితే భారత్కు తిరిగి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఆయన స్పందించారు. కర్ణాటక, మహారాష్ట్ర, గోవాలోని వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మోడీ. ఇక్కడ ముఖ్యంగా గోవా రాజధాని పనాజిలో పర్యావరణరహిత విమానాశ్రయాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని చాలా భావోద్వేగానికి గురయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను దేశం కోసం ఇంటిని, కుటుంబాన్ని కూడా వదిలేసుకున్నానని అన్నారు. అయితే ఈ సమయంలో మోడీ ముఖాన్ని పరిశీలించినట్లైతే దాదాపు కన్నీటి పర్యంతమైనంత పని చేశారు. ఆయన గొంతు గీరబోయింది. తనపై ఏ అవితీతి శక్తులు గుర్రుగా ఉన్నాయో తనకు తెలుసునని, తనను బ్రతకనివ్వరని అయినా వెనకడుగు వేసేది లేదని ఆయన చెప్పారు. ఈ మాటలు చెప్పేటప్పుడు ఆయన కొంత గంభీరం, కొంత ఉద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా ఆయన కార్యక్రమంలో పాల్గొన్న అందరిని నిలబడి చప్పట్లు కొడుతూ తనను ఆశీర్వదించాల్సిందిగా కోరారు. నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత కోట్ల మంది ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయినప్పటికీ, లక్షల మంది అవినీతి పరులు మాత్రం నిద్రమాత్రలు కొనుక్కోవాల్సి వచ్చిందని తెలిపారు. ఎవరినీ వదిలిపెట్టనని, 70 ఏళ్లనాటి అవినీతి చరిత్రను కూడా బయటకు తీస్తానని అన్నారు మోదీ.
