తెలంగాణ రాజకీయాల్లో ఊహించిన పరిణామం చోటుచేసుకుంది. మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ అయ్యారు. క్యాబినెట్ నుంచి ఆమెను తొలగించాలని సీఎం రేవంత్రెడ్డి చేసిన సిఫార్సును గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదించారు. అంతకుముందే సీఎం రేవంత్ లోక్భవన్కు వెళ్లి గవర్నర్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.
తనను మంత్రివర్గం నుంచి తొలగించాలంటూ సీఎం రేవంత్రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ను బ్లాక్మెయిల్ చేశారని కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు. బర్తరఫ్ నిర్ణయం వెలువడిన అనంతరం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. తన వివరణ తీసుకోకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉరిశిక్ష పడిన ముద్దాయిని కూడా చివరి కోరిక అడుగుతారని, కానీ తాను ఏ తప్పు చేయకపోయినా ఇలా చేయడం అన్యాయమన్నారు.
మంత్రి పదవి నుంచి తనను తొలగించే ఉద్దేశం కాంగ్రెస్ హైకమాండ్కు లేదని సురేఖ స్పష్టం చేశారు. సీఎం రేవంత్రెడ్డే హైకమాండ్ను బెదిరించి ఈ నిర్ణయం తీసుకునేలా చేశారని ఆరోపించారు. తనతో పాటు మాజీ ఓఎస్డీ సుమంత్పై కొందరు కుట్ర పన్నారని మండిపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఎంపీ వేం నరేందర్రెడ్డి, సీఎం సోదరులు తనపై కక్షగట్టారని విమర్శించారు.
తానెలాంటి తప్పు చేయలేదని, ఈ బర్తరఫ్ను తాను అవమానంగా భావించడం లేదని సురేఖ స్పష్టం చేశారు. ప్రజల బలమున్న నాయకులం తామని, జనం తమ వెంటే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె, కాంగ్రెస్కు రాజీనామా చేసే ఆలోచన మాత్రం లేదని స్పష్టం చేశారు. కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగుతానని వెల్లడించారు. ప్రభుత్వం, పార్టీ తీరు మారాల్సిన అవసరం ఉందని ఆమె హితవు పలికారు.
