పుట్టపర్తిలో వైఎస్ఆర్ రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు సీఎం జగన్. చంద్రబాబుకు దత్తపుత్రుడితో పాటు ఎల్లో మీడియా అండలు ఉన్నాయని కానీ తనకు ప్రజల మద్దతు ఉందన్నారు సీఎం జగన్. దేవుడి దయతో ప్రజల చల్లని దీవెనలతో ఉన్నానని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు అంటే స్కాంలు గుర్తొచ్చే పరిస్థితి వచ్చిందని…టీడీపీ హయాంలో జరిగిన కుంభకోణాల లిస్ట్ని వినిపించారు జగన్. స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఫైబర్ గ్రిడ్ స్కాం, మద్యం, ఇసుక దందా, ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం… ఇలా అన్నీ స్కామ్లే… చంద్రబాబు ఏది ముట్టుకున్నా స్కాంలే అని ఆరోపించారు.
ఆనాటి నుండైనా చంద్రబాబుకు దోచుకోవడం..దోచుకున్నది దాచుకోవడమే తెలుసన్నారు. బాబు తన పాలనలో స్కాంల గురించే తప్ప స్కీం గురించి ఆలోచించింది లేదని ఎద్దేవా చేశారు. పవన్ ముమ్మాటికి చంద్రబాబు దత్తపుత్రుడేనని మరోసారి ఆరోపించిన జగన్…బాబు కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు.
తనకు అబద్ధాలు చెప్పడం రాదని…అందరికీ మంచి చేయడం మాత్రమే తెలుసన్నారు. మంచి జరిగి ఉంటే మీరే సైనికులుగా నిలబడాలని…తాను గెలవడానికి ఒక దత్తపుత్రుడి సాయం, ఎల్లో మీడియా సపోర్టు అవసరం లేదని తేల్చిచెప్పారు.
