ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 28 వరకు మధ్యంతర బెయిల్పై ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే అనేక కేసుల్లో బాబు పేరును చేర్చింది ఏపీ సీఐడీ. ఇందులో ఇసుక కుంభకోణం ఒకటి. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 28 వరకు చంద్రబాబును అరెస్ట్ చేయమని సీఐడీ అధికారులు న్యాయస్థానానికి వెల్లడించారు. దీంతో కేసు తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది కోర్టు.
చంద్రబాబు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ… రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని, న్యాయవిచారణ ప్రక్రియలో మునిగిపోయేలా చేయాలనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం ఈ కేసు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. వైసీపీ పాలనలో ఇసుక అక్రమాలపై చంద్రబాబు, ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారని, అందుకే కేసులు పెట్టి వేధిస్తున్నారని వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను 22కి వాయిదా వేసింది.
టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇసుక విధానం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందని మైనింగ్ అధికారుల ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై కేసు నమోదు చేసింది సీఐడీ. ఇప్పటికే స్కిల్ స్కాంతో పాటు ఇసుక,ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం,ఫైబర్ నెట్ వర్క్, లిక్కర్ స్కాం ఇలా పలు కుంభకోణాల్లో చంద్రబాబు పేరును సీఐడీ చేర్చిన సంగతి తెలిసిందే.
