ఏపీ కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల..టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన షర్మిల తన కొడుకు రాజారెడ్డి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైఎస్ను చంద్రబాబు గుర్తు చేశారన్నారు. అప్పటి రాజకీయ పరిస్థితులు, వైఎస్తో ఉన్న అనుబంధాన్ని గురించి ప్రస్తావించారన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి ఇచ్చినా తాను పని చేస్తానని చెప్పుకొచ్చారు.
ఇప్పటికే షర్మిల తన కొడుకు వివాహానికి రావాల్సిందిగా తెలంగాణ సీఎం రేవంత్, భట్టి విక్రమార్క, పొంగులేటి, కోమటిరెడ్డితో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, పలువురు రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు. తాజాగా చంద్రబాబును కూడా తన ఇంట్లో జరిగే శుభకార్యానికి రావాల్సిందిగా కోరారు.
షర్మిల కుమారుడు రాజారెడ్డి…అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు అమ్మాయి అట్లూరి ప్రియను ప్రేమ వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఈనెల 18న రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థం జరగనుండగా ఫిబ్రవరి 17న వివాహం జరగనుంది.