ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి పలువురు ప్రజాప్రతినిధులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కొంతమంది రాజకీయాలకు దూరం కాగా మరికొంతమంది పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో కర్నూల్ జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి సైతం పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్పందించారు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన ఖండించారు.
ఎప్పటికీ వైసీపీలోనే ఉంటానని.. జగన్ వెంటే నడుస్తానని తేల్చిచెప్పారు. వ్యక్తిగత సమస్యల వల్లే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నానని, ఇకపై తనతో పాటు కుటుంబ సభ్యులు కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని స్పష్టం చేశారు.
వైసీపీ ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి లేదని తెలిపారు బాలనాగిరెడ్డి. పార్టీకి ద్రోహం చేసే ఆలోచన లేదని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే తమకు అభిమానమని వెల్లడించారు.
