నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో జనసేన పార్టీ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా రెండు వర్గాలుగా విడిపోయిన జనసేన నాయకులు నడిరోడ్డుపై బాహాబాహీకి దిగడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
సమాచారం ప్రకారం వేములపాటి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఆపాలని శ్రీధర్ అనుచరులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం మొదలై కొద్దిసేపటికే ఘర్షణగా మారింది.
ఇరువర్గాల నేతలు ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నడిరోడ్డుపైనే తోపులాటలు, పరస్పర దాడులు జరగడంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.
ఈ ఘటన తర్వాత ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీధర్ మరియు అతని అనుచరులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కార్యక్రమంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు వారిని సమాధానపరచే ప్రయత్నం చేయడంతో పరిస్థితి కొంతమేరకు శాంతించింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
