ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన క్రిస్టఫర్ నోలన్ మాస్టర్ పీస్ ‘ది ఒడిస్సీ’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, ఆ అంచనాలను అలవోకగా అందుకుంటూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు మాట్ డామన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా, విడుదలైన మొదటి వీకెండ్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 264 మిలియన్ డాలర్లకుపైగా (భారత కరెన్సీలో దాదాపు రూ.2,548 కోట్లకు పైనే) గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఇది దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ కెరీర్లోనే అత్యుత్తమ ఓపెనింగ్గా నిలవడం విశేషం.
‘ది ఒడిస్సీ’ చిత్రం తొలిరోజు భారత్లోనే రూ.20.76 కోట్లు వసూలు చేసి అదరగొట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు ఏకంగా 39.8 మిలియన్ డాలర్లు (సుమారు రూ.375 కోట్లు) సాధించి సత్తా చాటింది. తాజాగా ఈ సినిమా మొదటి మూడు రోజుల బాక్సాఫీస్ వసూళ్లను నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. కేవలం తొలి వీకెండ్లోనే ఈ చిత్రం 264 మిలియన్ డాలర్లను తన ఖాతాలో వేసుకోగా, అందులో ఒక్క ఉత్తర అమెరికా నుంచే 124 మిలియన్ డాలర్లు రావడం గమనార్హం.
గతంలో నోలన్ దర్శకత్వంలో వచ్చిన సూపర్హిట్ చిత్రాలైన ‘ది డార్క్ నైట్ రైజెస్’ (249 మిలియన్ డాలర్లు), ‘ఒప్పెన్హైమర్’ (181 మిలియన్ డాలర్లు) తొలి వీకెండ్ వసూళ్ల రికార్డులను ‘ది ఒడిస్సీ’ అవలీలగా బ్రేక్ చేసింది.
ప్రసిద్ధ గ్రీకు కవి హోమర్ రాసిన ‘ది ఒడిస్సీ’ ఇతిహాసం ఆధారంగా క్రిస్టఫర్ నోలన్ ఈ దృశ్యకావ్యాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. సుమారు రూ.2,000 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమాను కేవలం 91 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయడం మరో విశేషం. కేవలం మూడు రోజుల్లోనే ఈ స్థాయి కలెక్షన్లను రాబట్టడంతో, రాబోయే రోజుల్లో ఈ సినిమా అనతికాలంలోనే ‘వన్ బిలియన్ డాలర్ క్లబ్’లో చేరడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
