సోషల్ మీడియాలో సెలబ్రిటీల మధ్య జరిగే ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్ పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇతరుల గురించి ఆలోచిస్తూ అనవసరంగా సమయాన్ని వృథా చేసుకునే బదులు, తమ సొంత కెరీర్, ఎదుగుదలపై దృష్టి పెట్టాలని ఆయన అభిమానులకు హితవు పలికారు.
మంగళవారం హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో తన అభిమానులను కలుసుకున్న బన్ని, వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా కొందరు చేసే ట్రోల్స్, నెగెటివిటీపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మనకు నచ్చని వ్యక్తుల కోసం ఎవరైనా డబ్బులు ఖర్చు పెడతారా అని ప్రశ్నించిన ఆయన, అలాగే మనకు ఇష్టం లేని వారి కోసం మన విలువైన సమయాన్ని, శక్తిని ఎందుకు వృథా చేసుకోవాలని హితబోధ చేశారు. ప్రతి మనిషికి ఒక రోజులో ఉండే వంద శాతం శక్తిని దేనికి ఉపయోగించుకుంటామనేదే జీవితంలో అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.
అభిమానులను ఉద్దేశించి బన్ని మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో జరిగే వివాదాలు, ట్రోల్స్పై స్పందిస్తూ సమయం వృథా చేసుకునే బదులు ఆ శక్తిని మీ సొంత ఎదుగుదల కోసం ఉపయోగించుకోండి అని సూచించారు. సరదాగా మాట్లాడుతూ.. ‘‘మీకు నచ్చిన పని చేయండి.. కావాలంటే మీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందు కూర్చోండి, కనీసం ఆ సమయాన్నయినా ఆస్వాదిస్తారు కదా!’’ అంటూ నవ్వులు పూయించారు. ఎవరినీ ఎప్పుడూ ఎలాంటి ట్రోల్స్ చేయవద్దని, ఇతరులను విమర్శించడంలో సమయం గడిపే కంటే తమ జీవితాలను మెరుగుపరుచుకోవడంపై శ్రద్ధ పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
మరోవైపు సినిమాలపరంగా అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మాస్ యాక్షన్ మూవీ ‘రాకా’ చిత్రంలో ఆయన ప్రస్తుతం నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. దీని తర్వాత ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో మరో భారీ కమర్షియల్ సినిమాలో నటించేందుకు బన్ని సిద్ధమవుతున్నారు. వరుస క్రేజీ ప్రాజెక్ట్లతో దూసుకెళ్తున్న ఆయన, సినిమాలతో పాటు తన ఆలోచనలతోనూ ఎప్పుడూ ట్రెండింగ్లో నిలుస్తున్నారు.
