లద్దాఖ్లోని మినామార్గ్ చెక్పోస్టు వద్ద భద్రతా సిబ్బందితో ఓ పర్యాటకురాలు వాగ్వాదానికి దిగిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ ఘటనపై ఆర్మీ మాజీ చీఫ్, జనరల్ వీకే సింగ్ స్పందించారు. భద్రతా సిబ్బందిపై విమర్శలు చేసే ముందు అందరూ వాస్తవాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. దేశాన్ని కాపాడే రక్షణ కవచంగా మన సాయుధ బలగాలు పనిచేస్తున్నాయని ఆయన ఎక్స్ వేదికగా గుర్తుచేశారు. సైనికులను అన్యాయంగా నిందించడం, నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. దేశం కోసం నిత్యం త్యాగాలు చేస్తున్న సైనికులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు.
అసలు ఈ వివాదానికి అసలు కారణం ఏమిటంటే.. మినామార్గ్ ప్రాంతంలోని చెక్పోస్టు వద్ద వాహనాలను గంటల తరబడి నిలిపివేశారంటూ ఓ పర్యాటకురాలు భద్రతా సిబ్బందిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. కుటుంబాలు, చిన్న పిల్లలతో ప్రయాణిస్తున్నప్పటికీ అంతసేపు ఎందుకు ఆపారంటూ సిబ్బందిని గట్టిగా ప్రశ్నించింది. తాము ‘జెన్ జీ’ తరానికి చెందిన వాళ్లమని, ఇలాంటి పరిస్థితులను అస్సలు సహించబోమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సమయంలో ఓ భద్రతా కాన్వాయ్ రావడంతో, ఆమెను రోడ్డు పక్కకు వెళ్లాలని సిబ్బంది సూచించారు. రహదారిని కేవలం వీఐపీల కోసమే మూసివేశారని సదరు మహిళ ఆరోపించింది. అయితే ఆరోపణల్లో ఎంతవరకు నిజం ఉందనేది స్పష్టత లేదు. మినామార్గ్-జోజిలా మార్గంలో ప్రతికూల వాతావరణం, భద్రతా కారణాల వల్ల రాకపోకలను నియంత్రిస్తుంటామని అధికారులు తెలిపారు.
ఈ వైరల్ వీడియోపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చాలా ఘాటుగా స్పందించారు. పాత రోజుల్లో కొందరు రాజకీయ నాయకుల పిల్లలు ‘నా తండ్రి ఎవరో నీకు తెలుసా?’ అంటూ అధికారులను బెదిరించే వారని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ ‘మేము జెన్-జీ’ అనే పదం ఒక కొత్త రకం బెదిరింపు ధోరణిగా మారిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.
