- Advertisement -

గాలె టెస్టు.. వర్షం అడ్డంకి!

- Advertisement -

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్‌ఇండియా పటిష్ఠ స్థితికి చేరుకుంది. శ్రీలంక స్పిన్నర్లు పుంజుకున్నప్పటికీ, దేవ్‌దత్‌ పడిక్కల్‌ అద్భుత శతకానికి తోడు ధ్రువ్‌ జురెల్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ తోడవడంతో భారత్‌ భారీ స్కోరు దిశగా సాగింది. రెండో రోజు, ఆదివారం ఆట ముగిసే సమయానికి శుభ్‌మన్‌సేన తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు సాధించింది. ప్రస్తుతం కుల్‌దీప్‌ యాదవ్‌ (12), ప్రసిద్ధ్‌కృష్ణ (1) క్రీజులో ఉన్నారు.

తొలి రోజు 288/2 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌కు వర్షం తీవ్ర అంతరాయం కలిగించింది. చిత్తడి ఔట్‌ఫీల్డ్‌, వర్షం కారణంగా తొలి సెషన్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, సగం రోజు వృథా అయింది. కేవలం 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఈ పరిస్థితుల్లో వేగంగా పరుగులు సాధించే క్రమంలో రిషభ్‌ పంత్ (39), కేఎల్‌ రాహుల్ (82) త్వరగానే వెనుదిరిగినా, ఓవర్‌నైట్ సెంచరీ వీరుడు దేవ్‌దత్‌ పడిక్కల్‌ (167) తన జోరు కొనసాగించి అద్భుత మైలురాయిని అందుకున్నాడు.

పడిక్కల్‌తో పాటు వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌ (51) కీలక అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ వికెట్ల పతనాన్ని అడ్డుకుంటూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్‌ జయసూర్య (4/109), కెషార నువంత (3/175) భారత ఇన్నింగ్స్‌ను కట్టడి చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. జడేజా (13), మానవ్‌ సుతార్‌ (24) సైతం పర్వాలేనిపించడంతో భారత్‌ 460 పరుగుల భారీ స్కోరును నమోదు చేయగలిగింది.

మొత్తంగా గాలె టెస్టును వరుణుడు వెంటాడుతుండటం ఆటపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మ్యాచ్‌లో చాలా సమయం వృథా కావడంతో పాటు ముందు ముందు కూడా వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఫలితం తేలాలంటే టీమ్‌ఇండియా మూడో రోజు మరింత దూకుడుగా ఆడాల్సి రావడంతో పాటు వరుణుడు శాంతించాలని ఆశించక తప్పని పరిస్థితి నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -