సులభంగా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో ఓ కన్నతల్లి అమానుషమైన మార్గాన్ని ఎంచుకుంది. కంటికి రెప్పలా కాపాడి క్రమశిక్షణ నేర్పించాల్సిన తల్లే, మైనరైన తన కుమారుడిని అత్యంత క్రూరమైన సీరియల్ కిల్లర్గా మార్చింది. సిద్దిపేట జిల్లా భూంపల్లి గ్రామంలో వెలుగుచూసిన ఈ షాకింగ్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జిల్లా పోలీసు కమిషనరేట్లో సీపీ రష్మీ పెరుమాళ్, ఏసీపీ రవీందర్రెడ్డి ఈ దారుణానికి సంబంధించిన విస్తుపోయే నిజాలను మీడియా ముందు వెల్లడించారు.
గ్రామానికి చెందిన తెల్లాకుల రజిత (38) తన అనారోగ్య భర్త, కుమారుడితో కలిసి కిరాణా దుకాణం నడుపుతూ జీవిస్తోంది. అయితే సులభంగా ధనవంతులు కావాలని ఆశపడిన ఆమె, గ్రామంలోని అమాయక మహిళలను హతమార్చి వారి బంగారు నగలు దోచుకోవాలని కుట్ర పన్నింది. ఈ క్రూరమైన పథకం కోసం తన కుమారుడిని వక్రమార్గం పట్టించింది. అతడి శారీరక దారుఢ్యం పెరిగేందుకు ఇంట్లోనే జిమ్ పరికరాలు కొనిచ్చి బలంగా తయారు కావాలని ప్రోత్సహించింది. హత్యలు ఎలా చేయాలో యూట్యూబ్లో క్రైమ్ వీడియోలు చూసి మరీ తల్లీకొడుకులు శిక్షణ పొందడం గమనార్హం.
ఈనెల 8న గ్రామానికి చెందిన అతికం విజయ (45) దుకాణానికి రాగా, తల్లీకొడుకు ఇద్దరూ కలిసి ఆమెను లోపలికి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేశారు. మృతదేహాన్ని మూటకట్టి ద్విచక్రవాహనంపై రామక్కపేట శివారుకు తీసుకెళ్లి పెట్రోలు పోసి దహనం చేశారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా సీసీటీవీ పుటేజీ పరిశీలించగా రజిత కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో అసలు బండారం బయటపడింది. విచారణలో భాగంగా మే 28న కుంట రేఖ అనే మరో మహిళను కూడా ఇదే తరహాలో హత్య చేసి దహనం చేసినట్లు తేలింది. గతేడాది సర్పంచ్ భార్యపై దాడి చేసి నగలు ఎత్తుకెళ్లడంతో పాటు, మరో ముగ్గురు మహిళలను చంపేందుకు కూడా వీరు స్కెచ్ వేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు రజిత నిందితురాలిలా కాకుండా, బాధితులకు ఇతరులతో గొడవలున్నాయని నమ్మించే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా తన అనారోగ్య భర్తకు బీమా డబ్బుల కోసం కాళ్లపై వేడి నీళ్లు పోసి చిత్రహింసలు పెట్టినట్లు తేలింది. నిందితుల నుంచి బంగారు, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. రజితను కారాగారానికి, ఆమె మైనర్ కుమారుడిని జువెనైల్ హోమ్కు తరలించారు.
