- Advertisement -

మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ అక్రమాలు: జగన్

- Advertisement -

2025 మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ పెద్దఎత్తున అక్రమాలు బయటపడుతున్నాయని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయ‌న‌ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీఎస్సీ కుంభకోణం బండారం బయటపడుతుండటంతో సీఎం చంద్రబాబులో బీపీ పెరుగుతోందని ఎద్దేవా చేశారు. తాము లేవనెత్తిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా బాబు, లోకేష్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని మండిపడ్డారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి భయపెట్టాలని చూస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ‘మెగా డీఎస్సీ’ కాదని, నిజాయితీపరులైన అభ్యర్థుల పాలిట ‘దగా డీఎస్సీ’గా మారిందని విమర్శించారు. కేవలం రాజకీయ నాయకులే కాకుండా, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జర్నలిస్టులపై కూడా అక్రమ కేసులు పెట్టడం దారుణమని ఖండించారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ఈ రిక్రూట్‌మెంట్‌లో భారీగా గోల్‌మాల్ జరిగిందని జగన్ ఆరోపించారు. మెరిట్ లిస్ట్‌లో ఫస్ట్ ర్యాంకర్ వచ్చినప్పటికీ అతన్ని సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎందుకు పిలవలేదని నిలదీశారు. ఫస్ట్ ర్యాంకర్ పేరును ఎందుకు మార్చారని, అతనికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ అక్రమాలపైనే ఆ అభ్యర్థి స్వయంగా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. జీవో నంబర్లు 4, 47లను అడ్డంపెట్టుకుని తప్పుడు సర్టిఫికెట్లతో అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టేశారని మండిపడ్డారు.

ఈ స్కామ్‌కు సంబంధించిన ఆడియో, వీడియో కాల్స్ కూడా బయటకు వచ్చాయని జగన్ వెల్లడించారు. పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు అందరూ కుమ్మక్కై ఈ డీఎస్సీ కుంభకోణాన్ని దగ్గరుండి నడిపిస్తున్నారని ఆరోపించారు. తన కొడుకు నారా లోకేష్‌ను కాపాడుకునేందుకే చంద్రబాబు ఈ అక్రమాలను వెనకేసుకువస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న బాబు స్కామ్‌ల హిస్టరీలో ఇదొక పెద్ద ఆణిముత్యం అని జగన్ తీవ్రంగా విమర్శించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -